Site icon NTV Telugu

మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మళ్లీ మాటల యుద్ధం…!

రాజకీయంగా వారిద్దరూ ఉద్దండులే. ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఒకే పార్టీలో ఉన్నారు. ఆధిపత్యం కోసం వారు చేసే పనులు రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. వారి మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. మాటలతో మంట పుట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? కొత్త రగడ దేనికోసం? లెట్స్‌ వాచ్‌!

కండువా రంగులు కలిసినా.. మనసులు కలవలేదు

తాటికొండ రాజయ్య… టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. మరోనేత కడియం శ్రీహరి… మాజీ ఎమ్మెల్సీ. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేసినవారే. రాజకీయ క్షేత్రం ఒక్కటే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘనపూర్‌. గతంలో వేర్వేరు పార్టీలలో ఉంటూ ఒకరిపై ఒకరు పొలిటికల్‌ ఎత్తులు వేసుకున్న రాజయ్య, శ్రీహరిలు ప్రస్తుతం అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. పార్టీ కండువా రంగులు కలిసినంత ఈజీగా వీరి మనసులు కలవలేకపోతున్నాయి. కలిసి పనిచేయడానికి వారి రాజకీయ వైరం అడ్డొస్తోంది. స్వపక్షంలోనే విపక్షంగా ఉండకపోతే రాజకీయంగా మనుగడ కష్టమనుకుంటారో ఏమో… విమర్శలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. తాజాగా మరోసారి బాణాలు సంధించుకుంటున్నారు. జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టించి.. చర్చలోకి వచ్చారు నాయకులు.

శ్రీహరికి ప్రొటోకాల్‌ అవసరం లేదని రాజయ్య కామెంట్స్‌!
ప్రజాసేవకు ప్రొటోకాల్‌ అవసరం లేదని శ్రీహరి కౌంటర్‌!

సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన ముగిసిన తర్వాత ఈ గొడవ రాజుకోవడంతో పార్టీలో చర్చ మొదలైంది. కడియం శ్రీహరి పదవి ముగిసింది… ఆయనకు ప్రొటోకాల్‌ లేదని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కామెంట్‌ చేశారు ఎమ్మెల్యే రాజయ్య. ఈ మాటలు చెవిన పడగానే సర్రున లేచారు శ్రీహరి. ప్రజాసేవ చేయడానికి పదవులు.. ప్రొటోకాల్‌ అవసరం లేదని పరోక్షంగా చురకలు వేశారు. పైగా నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్‌, అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేసన్‌ ఘనపూర్‌ ప్రజలకు.. పదవి ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉండి సేవ చేయడమే లక్ష్యంగా చెప్పారు శ్రీహరి. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన స్టేషన్‌ ఘనపూర్‌తో ఉన్న బంధాన్ని ఎవరూ దూరం చేయలేరని ప్రకటించి రాజయ్య విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు.

శ్రీహరి ఘనపూర్‌ వెళ్తే.. రాజయ్య రియాక్షన్‌ ఏంటి?

ఈ లేటెస్ట్‌ ఎపిసోడ్‌ రాజయ్య, శ్రీహరి మధ్య ఆధిపత్య పోరుకు మళ్లీ ఆజ్యం పోసింది. శ్రీహరి ఎమ్మెల్సీ పదవీకాలం ఇటీవలే ముగిసింది. మరోఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారాయన. ఈ సందర్భంగానే శ్రీహరికి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని రాజయ్య కామెంట్‌ చేసినట్టు భావిస్తున్నారు. అయితే నియోజకవర్గానికి వస్తానని శ్రీహరి చేసిన ప్రకటనే టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. శ్రీహరి ఘనపూర్‌ వెళ్తే.. రాజయ్య రియాక్షన్‌ ఏంటన్నది పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. వరంగల్‌ పర్యటనలో ఎప్పుడూ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లే సీఎం కేసీఆర్‌ మొన్న.. కడియం శ్రీహరి ఇంటికి విందుకు వెళ్లారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఏమైనా హామీ ఇచ్చారో ఏమో.. శ్రీహరి స్వరంలో బేస్‌ పెరిగిందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య విమర్శలకు ఇచ్చిన కౌంటర్లనే దీనికి ఉదాహరణగా చెబుతున్నాయి.

కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందా.. కూత పెట్టే టైమ్‌ వచ్చిందా?

మొత్తానికి చాలా రోజుల తర్వాత ఘనపూర్‌లో ఉద్ధండులైన ఇద్దరు నాయకుల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతున్నాయి. కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందని.. ఇక కూత పెట్టే టైమ్‌ వచ్చిందని రాజయ్య, శ్రీహరి శిబిరాలు కామెంట్స్‌ చేస్తున్నాయట. మరి.. మాజీ డిప్యూటీ సీఎంలు ఇక్కడితో ఆగుతారో.. రగడను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

Exit mobile version