తెలంగాణ మహిళా కాంగ్రెస్లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్.
మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సునీతారావు ఎన్నికైన మొదట్లోనే.. కమిటీలో ఉన్న కొందరు నిత్యం ఫిర్యాదులు చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత దాదాపు పదినుంచి పదిహేను మందిని పార్టీ పదవుల నుంచి ఆమె తప్పించారట. ఈ విషయంలో కారాలు మిరాయాలు నూరుతోంది సునీతారావు వ్యతిరేకవర్గం. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు మహిళా నేతలు హైదరాబాద్ వచ్చిన మహిళా కాంగ్రెస్స్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజాకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో ప్రస్తావించిన ఆరోపణలు.. పార్టీని.. పదవులను మరింత దిగజార్చేలా ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్.. మహిళా కాంగ్రెస్ విభాగానికి ఇంఛార్జ్గా ఉంటున్నారు. ఆయనతో కూడా సునీతారావుకు గ్యాప్ కొనసాగుతోందట. అసంతృప్త మహిళా నేతలు.. నిత్యం మహేష్గౌడ్కు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడీ సమస్య మరింత పెరిగి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దగ్గరకు చేరిందట. ఇటీవల కాలంలో పీసీసీ చీఫ్తో భేటీ అవుతున్న మహిళా నేతలు సునీతారావుపై ఫిర్యాదుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. సునీతారావు నియంతలా మారారనేది అన్ని ఫిర్యాదుల సారాంశంగా ఉందట. తొలుత మహేష్గౌడ్, తర్వాత రేవంత్రెడ్డి, ఆపై AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజా వరకు కంప్లయింట్లు చేరుకున్నాయి.
ఈ మధ్యకాలంలో మహిళా కాంగ్రెస్ నుంచి జరిగినన్ని తొలగింపులు పీసీసీ పరిధిలోనూ లేవట. రేవంత్ తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సునీతారావుపై అంతకుమించిన వ్యతిరేకత మహిళా నేతల్లో ఉందట. ఈ గొడవలతో తల బొప్పికట్టిందో ఏమో.. మహిళా కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్.
చాలాకాలం తర్వాత కాంగ్రెస్లో మహిళా విభాగం కార్యక్రమాలు పెరిగాయి. కానీ.. సునీతారావు వ్యవహార శైలే మిగతావాళ్లకు మింగుడు పడటం లేదట. ప్రస్తుతం అందరి దృష్టీ ఫిర్యాదులు అందుకున్న మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజాపై ఉంది. ఆమె ఏం చేస్తారు? పీసీసీ పెద్దలతో, AICC ఇంఛార్జ్తో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? లేక సమస్యను రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వదిలేస్తారో తెలియదు. మరి.. ఈ సిగల రగడపై కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారో చూడాలి.