అక్కడ కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారుతున్నాయా? సొంతోళ్ళే సుత్తులు కాదు… ఏకంగా బుల్డోజర్లతోనే వచ్చి కూల్చేసుకుంటున్నారా? శత్రువులు ఎక్కడో ఉండరన్న సినిమా డైలాగ్ అక్కడి కాంగ్రెస్ నేతలకు పర్ఫెక్ట్గా సరిపోతుందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? చిల్లర రాజకీయాలన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోటల్లో పునర్ వైభవం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్మీదున్నాయి. కానీ… ఈ జోష్ ఎన్నాళ్ళు ఉంటుందన్న సందేహాలు మెల్లిగా పార్టీ వర్గాల్లోనే పెరుగుతున్నాయట. అందుకు ఉదాహరణగా డోర్నకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలనే చూపిస్తున్నారు. ఇక్కడ ద్వితీయ శ్రేణిని సమన్వయం చేసే నాయకత్వం సరిగా లేకపోవడంతో వర్గపోరు పెరిగిపోయి కోట బీయలు వారడం మొదలైందని అంటున్నారు. అతి స్వేచ్ఛ అసలుకే ఎసరు తెస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం డోర్నకల్ కాంగ్రెస్ కేడర్కు అధికారంలో ఉన్నామన్న సంతోషం కంటే… ముదురుతున్న గ్రూపు రాజకీయం ఎక్కడ పుట్టి ముంచుతుందోనన్న భయమే ఎక్కువగా ఉందట.అంతర్గత ఆధిపత్య పోరు చివరకు ప్రజల్లో కూడా పార్టీ ప్రతిష్టను పలచన చేస్తోందని అంటున్నారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన చేసే అధికారిక పర్యటనల్లో కనిపించని కొందరు నాయకులు.. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు నెహ్రూ నాయక్ వచ్చినప్పుడు మాత్రం ప్రత్యక్షమ వుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరు వస్తే సై.. మరొకరికి నై అనడం.. గ్రూప్వార్ని బట్టబయలు చేస్తోందని చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో రామచంద్రునాయక్ కూడా కేడర్కు సరిగా అందుబాటులో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. వచ్చినప్పుడు కూడా పర్యటనల్లో సమయపాలన పాటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అంటున్నారు. సూర్యాపేటలో నివాసం, మరిపెడలో క్యాంప్ కార్యాలయం పెట్టుకున్నారని, సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నామని అంటున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది. రామచంద్రునాయక్ తీరుతో విసిగిపోతున్న కొందరు అనివార్యంగా నెహ్రూ నాయక్ వైపు తిరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో డోర్నకల్ ఎమ్మెల్యే అనుచర వర్గం కూడా ఇష్టానుసారం వ్యవహరించడం విభేదాలను పెంచుతోందని అంటున్నారు. రామచంద్రు అందుబాటులో లేకపోవడంతో…. ఆయన పేరు చెప్పి కింది స్థాయిలో విచ్చలవిడిగా దందాలు చేస్తున్నారని, దానివల్ల ప్రజల్లో చులకన అవుతున్న అవుతున్నామన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల బాధ.
దీంతో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ విభేదాలు పెరిగిపోయి ఎవరికి వాళ్ళు మేమే లీడర్స్ అన్నట్టు ఫీలవుతున్నారట. ఇక ఇసుక దందాలో ఇటు ఎమ్మెల్యే రామచంద్రు, అటు నెహ్రూ నాయక్ అనుచరులు పోటీలు పడుతూ… అధికారుల మీద వత్తిళ్లు పెంచుతున్నారట. దీంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారన్నది లోకల్ పొలిటికల్ వాయిస్. ఇలాంటి పరిణామాలతో డోర్నకల్ కాంగ్రెస్లో లీడర్ల సంఖ్య పెరిగిపోయి క్యాడర్ తగ్గిపోతోందని అంటున్నారు. ఇక పాత, కొత్త పంచాయితీ సరేసరి.పదవుల పంపకాలు, స్థానిక ప్రాధాన్యతల్లో తమకు అన్యాయం జరుగుతోందని పాత కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారట.
సమన్వయంతో.. కలిసికట్టుగా పనిచేయండి, అందరికీ ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు లేవని అంటున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండని ఎమ్మెల్యే తీరును అలుసుగా తీసుకొని కొందరు.. మేమే సర్వం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని, అది వ్యతిరేక ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వెయ్యి రోజుల ర్యాలీని చూపిస్తున్నారు.
సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా ర్యాలీకి ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగలేదు. దీంతో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తీవ్ర అసంతృప్తితో ఊగిపోయినట్లు సమాచారం. అందరూ నాయకులే అవుతున్నారు.. క్షేత్రస్థాయిలో పని చేసే కార్యకర్తలు ఏరి? అంటూ ఆయన లోకల్ లీడర్స్పై మండిపడ్డట్టు తెలిసింది. ఇప్పటికైనా దీన్ని సరిచేయకపోతే… అంతా పల్లకీ ఎక్కేవాళ్ళేగానీ… మోసే వాళ్ళు దొరక్క ముప్పు వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

