Site icon NTV Telugu

ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ..!

ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్ మీదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ప్లేస్‌మెంట్‌ ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు. లెక్కలు మనం వేసుకుంటే ఫలితం రాదు.. నాయకుడు వేస్తేనే వస్తాయని సైలెంట్‌ అయ్యారట.

రెండు పేర్లు చివరి నిమిషంలో రేస్‌లోకి వచ్చాయా?

ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ కొద్దిరోజులుగా కసరత్తు చేసింది. సామాజికవర్గాల ఈక్వేషన్స్‌లో 50-50 శాతం రేషియో పాటిస్తున్న సీఎం జగన్ ఈసారి కూడా అదే ఫ్రేమ్‌వర్క్‌లో అభ్యర్ధుల ఎంపిక చేపట్టారు. ఈ లెక్కల్లోనే పార్టీ అధినేత గతంలో ఇచ్చిన హామీలు కూడా అండర్ కరెంట్‌గా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి కొనసాగింపు అంశం ముందు నుంచి స్పష్టంగా ఉన్నదే. మిగిలిన ఇద్దరిలో ఒకరు బీసీ, ఇంకొకరు మైనార్టీ. ఈ లెక్కకూడా సరిపోయింది అనుకున్నారు పార్టీ నేతలు. ఎటొచ్చి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో రెండు పేర్లు చివరి నిమిషంలో రేసులోకి వచ్చి ముందుకు దూసుకెళ్లాయి.

మర్రి పేరును రీప్లేస్‌ చేసిన హనుమంతరావు..!
మర్రికి ఎమ్మెల్సీ పదవి వార్తలకే పరిమితం..!

గుంటూరు జిల్లా లోకల్ కోటాలో ఒక స్థానం సీనియర్ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. ఇంకో స్థానంలో చాలాకాలం నుంచి ఇంటా, బయట నానుతున్న పేరు మర్రి రాజశేఖర్. గతంలో బహిరంగంగా జగన్ హామీ కూడా ఇచ్చారు. షార్ట్ లిస్ట్‌లో పేరు ఉండటంతో పార్టీలోని క్లోజ్‌ సర్కిల్స్‌ మర్రికి ఈసారి పదవి ఖాయం అనుకున్నాయి. సీన్‌ కట్ చేస్తే.. మురుగుడు హనుమంతరావు పేరు మర్రి నేమ్‌ను రిప్లేస్ చేసింది. హనుమంతరావు 1999, 2004లో మంగళగిరి ఎమ్మెల్యే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి. 2014లో టీడీపీలో చేరిన ఆయన ఈ మధ్యనే సైకిల్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ మంగళగిరిలో పర్యటిస్తున్నప్పుడే ఈ ప్రాంత చేనేత వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని వైసీపీ అధినేత ఈ రకంగా పూర్తి చేశారు. ఈ లెక్కతో మర్రి పేరు మరోసారి మిస్‌ అయింది. ఆయన ఎమ్మెల్సీ పదవి వార్తలకే పరిమితమైంది.

ఎస్సీ మాదిగ సామాజికవర్గంలో అరుణ్‌కుమార్‌కు పట్టం..!

ఈ జాబితాలో చివరి నిమిషంలో తెరమీదకు వచ్చిన మరో వ్యక్తి మొండితోక అరుణ్‌కుమార్‌. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పదవి పొంది పట్టుమని 3 నెలలు తిరక్కుండానే శాసనమండలి ఛాన్స్‌ కొట్టేశారు. కృష్ణా జిల్లా నుంచి ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకున్న హైకమాండ్‌కు ఎమ్మెల్సీ స్థాయికి సరిపోయేంత మరో అభ్యర్థి కనిపించకపోవడంతో అరుణ్‌నే ఎంపిక చేశారు. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవికి ఆయన త్వరలో రాజీనామా చేయాల్సి ఉంటుందన్నది వేరే విషయం. మొత్తం మీద ఈ రాజకీయ అంకగణితంలో మర్రి రాజశేఖర్‌ పేరు డిలీట్‌ అయింది. మరి ఆయనను ఏం చేయాలనుకుంటున్నారో సీఎం జగన్‌కు తప్ప ఎవరికీ తెలియదు. మర్రికి మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. కనీసం కారణమైనా ఆయనకు చెప్తారో లేదా ఆయనే తెలుసుకుంటారో చూడాలి.

మర్రి రాజశేఖర్‌ సంగతి ఏంటి?

ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీ అవుతారు… ఆ తర్వాత మంత్రిని చేస్తారు.. కేబినెట్‌ ప్రక్షాళన జరుగుతుంది అని అనుకుంటే.. ఆయన సంగతేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే అధినేత దృష్టిలో ఉన్న వారికి ఆలస్యంగానైనా అవకాశం వస్తుందని చెబుతున్నారు ముఖ్య నాయకులు. పదవి ఆశించి భంగపడిన వారు ప్రస్తుతానికి ఇలా సర్దుకోవాల్సిందే మరి.

Exit mobile version