Site icon NTV Telugu

Congress Politics: దేవరకద్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్తం

కోవర్టులు.. అంతర్గత కుమ్ములాటలు.. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో వీటి డోస్‌ ఎక్కువే. పార్టీ చీలికలు.. పేలికలు అయిపోయింది. హస్తం పార్టీని బలోపేతం చేయాలనే సంగతి పక్కనపెట్టి.. టికెట్‌ కోసం ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు.

నేతల్లో సఖ్యత కరువు.. కేడర్‌ పక్కచూపులు
మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్‌లో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నాయకత్వ లేమి, నేతల వర్గపోరు, కోవర్టు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పార్టీని ట్రాక్‌లో పెట్టడం ఇప్పట్లో అయ్యే పనేనా అనేది కేడర్‌ ప్రశ్న. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్‌, కరుడుకట్టిన కేడర్‌ ఉన్నప్పటికీ సమన్వయం లేదు. సందర్భం దొరికితే నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో లాభం లేదని అనుకున్న కొందరు కార్యకర్తలు పక్క చూపులు చూస్తున్నారట.

నేతలు సహకరించుకోకే కాంగ్రెస్‌ ఓడిందా?
దేవరకద్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. ఏడు మండలాలు ఉన్నాయి. 2009లో దేవరకద్ర నియోజకవర్గం ఏర్పడినప్పుడు తొలుత టీడీపీ పాగా వేసింది. 2014, 2018లో టీఆర్ఎస్‌ పట్టు బిగించింది. కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పట్టున్నా.. ఎన్నికల నాటికి చతికిల పడిపోతోంది. గత మూడు ఎన్నికల్లో జరిగింది అదే. ఈ పరిస్థితికి కేడర్‌ చెప్పే కారణాలు అనేకం ఉన్నాయి. ఎన్నికలు సమీపించే వరకు అభ్యర్థి ఎవరో అధిష్ఠానం తేల్చబోదని.. అప్పటి వరకు టికెట్‌ కోసం పోటీపడినవాళ్లు.. సహకరించక.. కోవర్టులుగా మారి సొంత కొమ్మనే నరికేస్తున్నారని చెబుతున్నారు.

పవన్‌ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో కాంగ్రెస్‌కు ఇంఛార్జ్‌ లేరు
వచ్చే ఎన్నికల్లో అందరినీ కలుపుకొని వెళ్లి.. కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు తీసుకెళ్లే నాయకుడు ఎవరనే చర్చ తాజాగా ఊపందుకుంది. నిన్న మొన్నటి వరకు దేవరకద్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా ఉన్న పవన్‌ కుమార్‌రెడ్డి హస్తానికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి పవన్‌కుమార్‌ రెడ్డే పోటీ చేశారు. ఇంఛార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నా పార్టీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇంఛార్జ్‌ పదవి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్ని ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థిని బలహీన పర్చేందుకు సోషల్‌ మీడియాను వాడేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ నాయకులే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారని మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నాయకులు.

సీతా దయాకర్‌రెడ్డి వస్తే టికెట్‌ ఆమెకేనా?
ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటారని ప్రచారం జరుగుతోంది. దేవరకద్ర లేదా మక్తల్‌ అసెంబ్లీ టికెట్‌ హామీతోనే వారి చేరిక ఉంటుందని టాక్‌. అదే జరిగితే దేవరకద్ర టికెట్‌ను సీతా దయాకర్‌రెడ్డి ఎగరేసుకుపోతారని అనుకుంటున్నారట. మొత్తం మీద దేవరకద్రలో హస్తం పార్టీని గట్టెక్కించే నాయకుడి కోసం కేడర్‌ ఎదురు చూస్తోంది. ఇప్పటికే చీలికలు పేలికలు అయిన పార్టీని ఎవరు గాడిలో పెడతారో చూడాలి.

Exit mobile version