OTR: శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా? యాదాద్రికి కొత్త కమిటీని ప్రకటించి… భద్రాద్రి గురించి ఎందుకు పట్టించుకోలేదు? 14 ఏళ్ళ నుంచి పాలక మండలి లేకున్నా… రామయ్య గురించి రవ్వంతైనా ఎందుకు ఆలోచించడం లేదు? ఈ ఆలయం మారుమూల ప్రాంతంలో ఉందనా..? లేక జిల్లాకు చెందిన ముఖ్యుల మధ్య సమన్వయం లేకనా? ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా… ఎందుకిలా జరుగుతోంది?
రామా…. కనవేమిరా…. శ్రీ రఘురామ కనవేమిరా…. అంటూ ఇబ్బందుల్లో ఉన్న భక్తులు ఆ దశరధ తనయుడిని వేడుకుంటారు. అటు రామయ్యకు కూడా కష్టాలేం కొత్త కాకున్నా.. ప్రస్తుతం భద్రాద్రిలో మాత్రం ఆయన సమస్యలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయట. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాముఖ్యం, ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాంటి టెంపుల్కు 14 ఏళ్ళుగా పాలక మండలి లేదు. దాంతో ఇక్కడేం జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయోధ్య రాముడి మీదున్న ప్రేమలో ఆవగింజంత అయినా… ఇటువైపు ఉంటే ఆ లెక్కే వేరుగా ఉండేదన్నది భద్రాచలంలో గట్టిగా వినిపిస్తున్న మాట.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. అయినాసరే… పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడానికి పాలక మండలిని ఎందుకు నియమించడం లేదన్నది భక్తుల ప్రశ్న. తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి ప్రకటనతో భద్రాద్రి ప్రస్తావన కూడా మరోసారి తెర మీదికి వచ్చింది. ఆ విషయంలో రకరకాల విమర్శలు ఉన్నా ఏదో రకంగా ప్రకటన అయితే వచ్చింది కదా… ఇక్కడ అది కూడా లేదు ఎందుకని అడుగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2012లో అప్పటి కమిటీ గడువు ముగిసిపోయింది.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డ్ ఊసేలేదు. అటు అభివృద్ధి విషయంలో కూడా చిన్నచూపే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి రామయ్యను చాలా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక…. ఇటీవల డెవలప్మెంట్ యాక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. 360 కోట్లతో పనులు జస్ట్ మొదలయ్యాయి.15వ శతాబ్దంలో రామదాసు హయాంలో దేవాలయ నిర్మాణం చేపడితే.. మళ్లీ ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో వివిధ నిర్మాణ పనులు మొదలయ్యాయన్నది స్థానికులు చెబుతున్నా మాట. కానీ… ఈ విషయంలో కూడా ఎక్కడో తేడా కొడుతోందట.
ఆలయ అభివృద్ధి కోసం వందల కోట్ల బడ్జెట్ కేటాయించినా… వర్క్ చేయడానికి ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకే ఒక్క కాంట్రాక్టర్ రావడంతో… నిబంధనలకు విరుద్ధంగానే అయినా…. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు పనులు కట్టబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా… ఆలయ పాలకమండలి నియామకం గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నది ఎక్కువ మంది ప్రశ్న. అది ఎప్పుడెప్పుడా అంటూ చాలామంది స్థానిక నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్ సైతం నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, అందునా కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నా… భద్రాద్రి రామయ్య గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నది బిగ్ క్వశ్చన్.
భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నా… ట్రస్ట్ బోర్డ్ పదవుల కోసం అనుచరులు పలువురు వాళ్ళచుట్టూ తిరుగుతున్నా… ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతం సంగతి ఎలా ఉన్నా… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ళ కాలంలోనైనా పాలక వర్గం గురించి పట్టించుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా యాదాద్రి పాలక వర్గాన్ని ప్రకటించడంతో మళ్లీ ఇక్కడ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రిలో కూడా యాదాద్రి తరహాలోనే జిల్లా బయటి వారికి చోటిస్తారా? లేక గతంలో వేసినట్లుగానే జిల్లాకు చెందిన వాళ్ళనే నియమిస్తారా అన్న అంశం సైతం చర్చకు వస్తోంది.
అదే సమయంలో ముందు జిల్లాకు చెందిన ముఖ్యుల మధ్య సమన్వయం ఉంటేనే కదా..? అంటూ దీర్ఘం తీసేవాళ్ళు సైతం పెరుగుతున్నారు. జిల్లా నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడం వల్లనే… ఈ టెంపుల్ గురించి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా…. యాదాద్రి ఇన్స్పిరేషన్తో త్వరలోనే భద్రాద్రికి కూడా ఉండవచ్చంటూ… ఎవరికి వారు జోరుగా పైరవీలు మొదలుపెడుతున్నారట. మరి 14 ఏళ్ల తర్వాత అయినా… మోక్షం లభిస్తుందా? ప్రభుత్వ పెద్దల మనసు రామయ్య మీదికి మళ్ళుతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.

