Site icon NTV Telugu

Donald Trump-Netanyahu: కరుడుకట్టిన ఉన్మాదులు..పిలల్ని కూడా చంపేశారు.. ఈ ఇద్దరు సైకోపాత్స్‌తో ప్రపంచం సర్వనాశనం!

Two textbook Psychopaths Donald Trump And Benjamin Netanyahu

Two Psychopaths Donald Trump And Benjamin Netanyahu

యుద్ధాలు ఎప్పుడూ యుద్ధభూముల్లోనే మొదలుకావు. కొన్నిసార్లు అవి దూరంగా ఉన్న అధికార గదుల్లో మొదలవుతాయి. అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను అగ్నిగుండాలుగా మార్చుతుంది. అదే నిర్ణయాల ప్రతిధ్వని చివరకు పాఠశాలల గోడలపై పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు ప్రపంచ రాజకీయాల్లో ఎన్నోసార్లు వినిపించాయి కానీ.. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఆ పేర్లు మరో కారణంతో చర్చకు వచ్చాయి. ఎందుకంటే యుద్ధం మొదటి రోజే ప్రపంచాన్ని కుదిపేసిన ఒక దారుణ ఘటన జరిగింది.

స్కూల్‌లో ఉన్న చిన్నారులపై మిస్సైల్స్‌ పడ్డాయి. ఒక సాధారణ ఉదయం.. ప్రార్థనలు ప్రారంభమైన సమయంలో పుస్తకాలు తెరిచి కూర్చున్న చిన్న బాలికలు ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలతో భయంతో వణికిపోయారు.

కొన్ని క్షణాల్లోనే ఆ పాఠశాల ప్రాంగణం పొగతో, మంటలతో నిండిపోయింది. ఆ రోజు 7 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. టెక్నాలజీలో అందరికంటే ముందుండే అమెరికా, ఇజ్రాయెల్‌ ఇలా స్కూల్‌పై బాంబులు వెయ్యడం తీవ్ర విమర్శలకు కారణమైంది. తెలిసి చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినా పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకురాలేరు కదా..! అందుకే ట్రంప్‌, నెతన్యాహు ఇద్దరిని సైకోపాత్స్‌గా కొన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

యుద్ధం మొదటి రోజే జరిగిన ఆ దారుణం ప్రపంచాన్ని కుదిపేసింది. కానీ ఆ ఘటన ఒక్కసారిగా పుట్టిన విషాదం కాదు. దానికి ముందు కూడా మధ్యప్రాచ్యం ఎన్నో యుద్ధాల నీడలోనే జీవించింది. ఆ యుద్ధాల్లో ముఖ్యంగా వినిపించే రెండు పేర్లు.. డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు.

ఇద్దరూ వేర్వేరు దేశాల నాయకులు అయినా వారి నిర్ణయాలు ఒకే ప్రాంతాన్ని మళ్లీ మళ్లీ నిప్పులగుండంగా మార్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు కేవలం ఇరాన్‌ను మాత్రమే టార్గెట్‌ చేయలేదు. ఆయన పాలనతో గాజా అనేకసార్లు భారీ సైనిక దాడులను చూసింది. ప్రతి యుద్ధం తర్వాత అక్కడి నగరాలు శిథిలాలుగా మారిపోయేవి. అపార్ట్‌మెంట్లు కూలిపోయిన వీధులు, బాంబులతో ధ్వంసమైన ఆస్పత్రులు, శరణార్థులుగా మారిన వేలాది కుటుంబాలు గాజా జీవితంలో సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అనేకసార్లు గాజాలో పౌరుల ప్రాణనష్టం భారీగా జరిగిందని నివేదికలు విడుదల చేశాయి. ఈ యుద్ధాల వెనుక ఉన్న వ్యూహాల్లో ఒకటి శత్రువు సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి భారీ శక్తిని వినియోగించడం. ఆ వ్యూహం అమలైనప్పుడు నగరాలు యుద్ధభూములుగా మారిపోతాయి. విద్యుత్ కేంద్రాలు, నీటి సదుపాయాలు, నివాస ప్రాంతాలు కూడా దెబ్బతింటాయి. యుద్ధం ముగిసిన తర్వాత మిగిలేది ధ్వంసమైన మౌలిక వసతులు, పునర్నిర్మాణం కోసం సంవత్సరాలు పట్టే నగరాలే. ఇటు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రయాణం కూడా మధ్యప్రాచ్యంపై ప్రభావం చూపింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఇరాన్‌తో ఉన్న అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ నిర్ణయం తర్వాత మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా డ్రోన్ దాడులు, సైనిక చర్యలు తరచూ వార్తల్లో నిలిచాయి. కొన్ని దాడుల్లో పౌరుల ప్రాణనష్టం జరిగినట్లు మానవ హక్కుల సంస్థలు రిపోర్టు చేశాయి. ట్రంప్ పరిపాలనలో అమెరికా విదేశాంగ విధానం ఒక కొత్త దిశలో నడిచింది. అంతర్జాతీయ ఒప్పందాల కంటే ప్రత్యక్ష సైనిక ఒత్తిడికి ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు మరింత బలపడింది. ఈ రాజకీయ సమీకరణాలు మధ్యప్రాచ్యాన్ని మరింత అస్థిరంగా మార్చాయని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ ఇద్దరు నాయకుల రాజకీయతత్వంలో ఒక సామాన్య అంశం కనిపిస్తుంది. భద్రత పేరుతో కఠినమైన చర్యలను సమర్థించుకోవడం వారికి అలవాటు. ఈ విధానాన్ని వారి మద్దతుదారులు బలమైన నాయకత్వంగా భావిస్తారు. కానీ విమర్శకులు మాత్రం ఆ నిర్ణయాల భారాన్ని చివరకు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఎందుకంటే యుద్ధాల్లో చనిపోయేది ఎక్కువగా సైనికులు, మిలిటెంట్లు కాదు.. పౌరులే. ఇలా ప్రతి యుద్ధం తర్వాత ఇదే కథ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. యుద్ధం గెలిచిన వారి గురించి చరిత్ర గొప్పగా చెప్పుకోవచ్చు కానీ..ఆ యుద్ధాల్లో కోల్పోయిన అమాయక ప్రాణాల జాబితా మాత్రం ఎప్పటికీ మానవ చరిత్రలో ఒక బాధాకరమైన గుర్తుగానే మిగిలిపోతుంది.

Exit mobile version