Site icon NTV Telugu

Dwaraka: ‘ఇన్‌స్టా రీల్‌ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!

Sahil mother

Sahilmother

‘ఒకరి రీల్‌ సరదా నా బిడ్డ ప్రాణం తీసింది..’ ఈ మాట చెబుతున్న సమయంలో ఆ తల్లి గొంతు కంపించుకుపోయింది. మాటల కంటే కన్నీళ్లే ముందుగా జారిపోయాయి. రోడ్డుపై జరిగిన ఒక నిర్లక్ష్య క్షణం.. ఒక తల్లి జీవితాన్ని శాశ్వత విషాదంగా మార్చేసింది. ద్వారకలోని ఓ చిన్న ఇంట్లో ఇప్పటికీ ఆమె కుమారుడి మెడల్స్ గోడలపై వేలాడుతున్నాయి. టేబుల్‌పై ఉన్న నోట్‌బుక్స్ అలాగే పడి ఉన్నాయి.

యూకే-మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అడ్మిషన్ మెయిల్ ఇంకా ఫోన్‌లో కనిపిస్తూనే ఉంది. కానీ 23 ఏళ్ల సహిల్ ధనేశ్రా మాత్రం ఈ ప్రపంచంలో లేడు. ఫిబ్రవరి 3 ఉదయం ఆఫీసుకి బయలుదేరిన అతను, మధ్యాహ్నానికి రోడ్డుపై ప్రాణం కోల్పోయాడు. లాల్ బహదూర్ శాస్త్రి కాలేజీ సమీపంలో ఒక SUV అతని బైక్‌ను ఢీకొట్టింది. ఆ వాహనాన్ని నడిపింది ఒక మైనర్ బాలుడు. లైసెన్స్ లేదు. అయినా కారు అతని చేతుల్లో ఉంది. సహిల్ తల్లి ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదు., సోషల్ మీడియా కోసం స్టంట్ డ్రైవింగ్ చేస్తూ, సరదా రీల్ చిత్రీకరిస్తూ వేగంగా ఎదురుగా వచ్చిన వాహనం తన కొడుకును తాకిందని ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఆ కారు నడిపిన మైనర్ కనీసం బ్రేకులు కూడా వేయలేదని.. తన కుమారుడిని ఢీకొట్టిన తర్వాత మరో పార్క్ చేసిన కారును కూడా ఢీకొట్టిందని చెబుతోంది.

అందుకే ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు. ఇది నిర్లక్ష్యం. ఇది బాధ్యతారాహిత్యం. ఇది డబ్బు, ప్రభావం ఉన్నవాళ్లు రోడ్డును కూడా తమ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్న దుర్మార్గం. మైనర్‌కు ఇప్పటికే ఓవర్‌స్పీడింగ్ చలాన్లు ఉన్నాయి. అయినా కూడా లైసెన్స్ లేని ఆ మైనర్‌కి కారు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? అసలేం జరిగింది?

పోలీసుల ప్రకారం ఫిబ్రవరి 3 ఉదయం 11 గంటల 57 నిమిషాలకు ఒక కాల్ వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న ద్వారక సౌత్ పోలీసులకు మూడు వాహనాలు ప్రమాదానికి గురైన స్థితిలో కనిపించాయి. సహిల్ ధనేశ్రా అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరో టాక్సీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు.

SUV నడిపిన మైనర్ పక్కనే అతని సిస్టర్‌ కూడా ఉంది. ఇక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరు పరిచారు. తర్వాత అతన్ని ఆబ్జర్వేషన్ హోమ్‌కు పంపించారు. అయితే ఫిబ్రవరి 10న అతనికి పదో తరగతి బోర్డు పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇదే అంశం సహిల్ తల్లి ఇన్నా మాకన్‌కు భరించలేనిదిగా మారింది. ఒక ప్రాణం పోయింది కానీ చట్టం ముందు మాత్రం ఇది కేవలం ఒక కేసు సంఖ్యగా మిగిలిపోయిందా అనే ప్రశ్న ఆమెను వేధించింది. వెంటనే జస్టిస్ ఫర్ సహిల్ పేరుతో ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభమైంది. వేలాది మంది సంతకాలు చేశారు.

మరోవైపు ఇప్పటికే ఓవర్ స్పీడింగ్ చలాన్లు ఉన్న మైనర్‌కు మళ్లీ వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అనేక విమర్శలు వస్తున్నాయి.

చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే, వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు వాహన యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి ఇండియాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో ఎక్కువగా ఓవర్ స్పీడింగ్ కారణంగానే జరుగుతున్నాయి. కానీ చట్టం అమలు విషయంలో అసమానతలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

నేరం చేసిన వ్యక్తి సాధారణ కుటుంబానికి చెందినవాడు అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే సమాజంలో పేరు, డబ్బు ఉన్నవాళ్లకి మాత్రం చట్టం వర్తించడంలేదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ALSO READ: మరణానికి 85 సెకన్ల దూరంలో భూమి.. డూమ్స్‌ డే క్లాక్‌ చెబుతున్న భయంకర నిజాలు!

Exit mobile version