వెస్ట్ ఏషియా(West Asia) ఎడారుల్లో రాత్రులు ఎప్పుడూ భయంకరంగానే ఉంటాయి. అక్కడ గాలి కూడా రహస్యాలనే మోస్తూ తిరుగుతుంది. ఇసుక రేణువుల కింద ఎన్నో యుద్ధాల ముద్రలు దాగి ఉంటాయి. ఒక దేశం మరో దేశాన్ని నమ్మని నేల అది. ప్రతి సరిహద్దు వెనుక ఒక భయం ఉంటుంది. ప్రతి ఆకాశ గర్జన వెనుక ఒక కుట్ర దాగి ఉంటుంది. కానీ ఈసారి బయటకొచ్చిన ఘటన ఏకంగా యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది.
ఇరాక్ ఎడారి గుండెల్లో ఎవరికీ తెలియకుండా నిర్మించబడిన ఒక రహస్య స్థావరం ఉంది. అది ఇజ్రాయెల్ నిర్మించిన గోప్యమైన యుద్ధ కేంద్రం అని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరాన్పై దాడులకు ముందు నుంచే ఈ స్థావరం సిద్ధమైందని వస్తున్న సమాచారం ఇప్పుడు వెస్ట్ ఏషియా రాజకీయాలను అగ్నిగుండంలా మార్చేసింది. ఇంతకీ ఈ సీక్రెట్ బేస్ను ఇజ్రాయెల్ ఎందుకు నిర్మించింది? ఈ బేస్ కారణంగానే యుద్ధంలో ఇరాన్ చావుదెబ్బ తిన్నదా?
ఇరాక్ సరిహద్దుల్లో విస్తారమైన ఎడారి ప్రాంతం ఉంది. మనిషి కంటికి కనిపించని అంత దూరంలో.. అక్కడ ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు పనిచేశాయని సమాచారం వెలుగులోకి వచ్చింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం:
అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈ రహస్య స్థావరాన్ని ఇజ్రాయెల్ యుద్ధానికి కొద్ది కాలం ముందే నిర్మించింది. అమెరికాకు కూడా ఈ వ్యవహారం తెలిసినట్టే వార్తలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు సహకారం అందించారని అంటున్నారు. అంతేకాదు విమానాలు కూలిపోతే పైలట్లను రక్షించేందుకు ప్రత్యేక బృందాలూ సిద్ధంగా ఉన్నాయని సమాచారం. కానీ ఈ రహస్యం ఎప్పటిలాగే చీకట్లోనే మిగిలిపోలేదు. ఒక చిన్న అనుమానం మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. నజాఫ్ ఎడారి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయని ఇరాక్ సైన్యానికి సమాచారం వచ్చింది. వెంటనే దర్యాప్తుకు వెళ్లిన దళాలపై ఒక్కసారిగా ఆకాశం నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతోందో అర్థం కాకముందే ఒక సైనికుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాత భారీ బలగాలు అక్కడికి చేరుకున్నా ఏమీ కనిపించలేదని ఇరాక్ ప్రకటించింది. కానీ అప్పటికే అనుమానాల మంటలు వ్యాపించాయి.
నలిగిపోతున్న ఇరాక్:
ఆ ఎడారిలో గొర్రెలు మేపుకునే ఒక కాపరి కొన్ని హెలికాప్టర్లు చూసి సమాచారం ఇచ్చాడట. ఆ తర్వాత అతని వాహనం లక్ష్యంగా మారిందని కథనాలు చెబుతున్నాయి. అతను చనిపోయాడని సమాచారం బయటకు రావడంతో ఈ ఘటన మరింత భయంకరంగా మారింది. అయితే ఇరాక్ ప్రభుత్వం మాత్రం మొదటినుంచీ ఈ వార్తలను ఖండిస్తోంది. తమ భూభాగంలో ఎలాంటి విదేశీ స్థావరాలు లేవని చెబుతోంది. కానీ కొందరు ఇరాకీ అధికారులు మాత్రం అమెరికా సహకారంతో రహస్య ఆపరేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు. అదే ఇప్పుడు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒక వైపు అమెరికా, మరో వైపు ఇరాన్, ఇంకో వైపు ఇజ్రాయెల్.. ఈ మూడు శక్తుల మధ్య ఇరాక్ నలిగిపోతున్న దేశంలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాక్ భూభాగంలో ఇరాన్ అనుకూల మిలీషియా బలగాలు ఉన్నాయి. అమెరికా దళాలూ ఉన్నాయి. అప్పుడప్పుడు డ్రోన్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటపడుతున్న పరిణామాలు పరిస్థితిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎందుకంటే ఇది కనిపించని యుద్ధం. పత్రికల్లో కనిపించని యుద్ధం.
నోరువిప్పని ఇజ్రాయెల్:
ఒక దేశం భూభాగాన్ని మరో దేశం రహస్యంగా వినియోగిస్తోందన్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ కూడా ఈ వార్తలను చాలా సీరియస్గా తీసుకుంది. ఇజ్రాయెల్.. ఏ హద్దుల్నీ గౌరవించదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని ఇరాక్ ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రకటించారు. అంటే ఇప్పుడు ఈ వివాదం కేవలం ఒక రహస్య స్థావరం కథగా మిగలలేదు. అది వెస్ట్ ఏషియా భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర మలుపుగా మారుతోంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అదే ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో మౌనం కూడా కొన్నిసార్లు సమాధానమే అవుతుంది. ముఖ్యంగా యుద్ధాల సమయంలో మౌనమే అంగీకరం అవుతుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇజ్రాయెల్వైపే పడింది. మరి ఇజ్రాయెల్ చేసిన ఈ పని ఇరాక్ను ఎంతనాశనం చేస్తుందో కొన్నాళ్లు గడిస్తే కానీ చెప్పలేం.
