జీవితం తలకిందులైంది అనే మాట అప్పుడప్పుడు వింటూ ఉంటాం…! ఒక్కరికో ఇద్దరికో కాదు… మొత్తం దేశంలో ఉన్న ప్రజల జీవితాలన్నీ తలకిందులవుతున్నాయి.. ఇంకా చెప్పాలంటే దేశం తీవ్రమైన గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. కారణాలు ఏమైనా కావొచ్చు.. ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులపై ధరల పిడుగు నాట్యమాడుతోంది. ఉదయం లేస్తే తాగే పాల నుంచి.. ఏసీల వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతోంది. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధం.. దాని కారణంగా పెరిగిన ముడిసరుకుల ధరలు.. సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ ను తలకిందులు చేస్తున్నాయి. 
ధరలు పెంచిపడేస్తున్నారు:
పాలు.. భోజనం.. సబ్బులు.. ప్యాకేజ్డ్ గూడ్స్.. ఇలా ప్రతి రోజూ మనం ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు.. భారత్లోని సామాన్యుల జేబులకు తీవ్ర స్థాయిలో చిల్లులు పెడుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ గోద్రెజ్.. మారికో.. డాబర్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచాయి. సబ్బులు, డిటర్జెంట్లు, ఇతర గృహోపకరణాలపై గోద్రెజ్ సంస్థ 4 నుంచి 7 శాతం.. అలాగే మారికో 6 నుంచి 7 శాతం వరకు ధరలు పెంచాయి. దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ కూడా 2 నుంచి 5 శాతం మేర ధరలు పెంచగా.. డాబర్ సంస్థ తన హోమ్ అండ్ పర్సనల్ కేర్ విభాగంలో 4 శాతం మేర భారాన్ని మోపింది.
భోజనం కూడా మింగలేని పరిస్థితి:
ఇక సామాన్యుడి కడుపు నింపే సాధారణ భోజనం కూడా ఆర్థికంగా భారంగానే మారుతోంది. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో తినే వెజ్… నాన్-వెజ్ భోజనం ధరలు ఏకంగా 2 శాతం మేర పెరిగాయి. మరోవైపు పశుగ్రాసం, ప్యాకేజింగ్ ఫిల్మ్, రవాణా ఖర్చులు అంతకంతకూ పెరగడంతో పాల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ప్రముఖ డెయిరీ సంస్థలు అమూల్, మదర్ డెయిరీ.. మార్కెట్లో లీటర్ పాల ప్యాకెట్లపై 2 నుంచి 3 రూపాయల వరకు పెంచేశాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరల పెరుగుదల వల్లనే డెయిరీ రంగంలో ఈ పరిస్థితి తలెత్తింది.
ఈ పెరుగుదల ఇక్కడితో ఆగదా?
రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో పాటు ఏసీలు, ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. టాటా గ్రూప్కు చెందిన వోల్టాస్, బ్లూ స్టార్ వంటి సంస్థలు ఇప్పటికే ఏసీల ధరలను 5 శాతం వరకు పెంచాయి. కరెన్సీ మారకపు నిల్వల్లో హెచ్చుతగ్గుల కారణంగా మరో 8 శాతం వరకు ధరలు పెంచే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. ఇక సొంతింటి కల నెరవేర్చుకునే వారికి కూడా ద్రవ్యోల్బణం దెబ్బ పడుతోంది, ముఖ్యంగా పెయింట్స్ ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో లీడర్ గా ఉన్న ఏషియన్ పెయింట్స్ ఏకంగా 9 నుంచి 14 శాతం వరకు విడతల వారీగా ధరలను పెంచడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అంతర్జాతీయ పరిణామాలతో ఈ ద్రవ్యోల్బణ ప్రభావం ముందుముందు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుInణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా రిటైల్ ఇంధన ధరలు మరో 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకం పెంచడంతో పసిడి కొనుగోళ్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రజలు తమ ఖర్చులను కుదించుకునే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పీక్ స్టేజ్ కు చేరుకుంటే… అవసరం ఎలాంటిదైనా.. ఎంత అత్యవసరమైనా ప్రజలు తమ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే ప్రమాదముంది.
:- ఫణి కుమార్ (NTV DIGITAL)
