మానవజాతి వినాశనానికి కొలమానంగా చూసే డూమ్స్డే క్లాక్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ క్లాక్ను మరోసారి ముందుకు జరిపారు శాస్త్రవేత్తలు.
ఈసారి అది అర్ధరాత్రికి కేవలం 85 సెకన్ల దూరంలో ఆగింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయి. అణు యుద్ధాల భయంతో ప్రపంచం గడగడలాడిన కాలాలకన్నా కూడా దగ్గరగా ఉన్న స్థాయి ఇదే! ఇంతకీ ఏంటీ డూమ్స్డే క్లాక్. అర్థరాత్రికి 85 సెకన్లు దూరంలో గడియారం ముల్లు ఆగిందంటే ప్రపంచానికి అంతం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలా?
డూమ్స్డే క్లాక్ అనేది నిజంగా గోడపై వేలాడే సాధారణ గడియారం కాదు. ఇది ప్రపంచం ఎక్కడ నిలబడి ఉందో చెప్పే ఒక సూచిక. 1947లో అమెరికా శాస్త్రవేత్తల సంఘం దీన్ని ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అణుబాంబు ప్రపంచాన్ని ఎంత ప్రమాదకర దిశలోకి నడిపిస్తుందో చెప్పడానికి వారు ఓ గుర్తును ఎంచుకున్నారు.
ఆ గుర్తే ఈ గడియారం. ఇందులో అర్థరాత్రి అంటే మానవజాతికి అత్యంత భయంకరమైన స్థితి. అణు యుద్ధం కావొచ్చు, వాతావరణ వినాశనం కావొచ్చు, లేదా నియంత్రణ తప్పిన సాంకేతిక ప్రమాదం కావొచ్చు. ఏది జరిగినా ప్రపంచానికి తిరిగి మామూలు స్థితి ఉండని క్షణాన్ని అర్థరాత్రిగా సూచిస్తారు. ఈ గడియారం ఆటోమేటిక్గా కదలదు. ఎవరూ బ్యాటరీ పెట్టరు. టైమ్తో దీనికి సంబంధం లేదు. ప్రతి ఏడాది ప్రపంచ పరిస్థితిని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ప్రపంచ పరిస్థితులను పరిశీలించి గడియారాన్ని ముందుకు లేదా వెనక్కి జరుపుతారు. అణు ఆయుధాల ఒప్పందాలు కుదిరినా, యుద్ధ భయాలు పెరిగినా అది ముందుకు వెళ్తుంది. వాతావరణ మార్పుపై దేశాలు చర్యలు తీసుకుంటే వెనక్కి తగ్గుతుంది. కానీ చర్యలు లేకపోతే మళ్లీ ముందుకు కదులుతుంది. అంటే ఇది భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యం కాదు. మన ప్రస్తుత నిర్ణయాలు ప్రపంచాన్ని ఎంత ప్రమాదానికి దగ్గర తీసుకెళ్తున్నాయో చెప్పే హెచ్చరిక మాత్రమే.
2026లో ఈ గడియారం 85సెకన్లకు వచ్చిందంటే రేపే ప్రపంచం అంతమవుతుందన్న అర్థం కాదు. కానీ ఇప్పటివరకు ఉన్న అన్ని దశలకన్నా ప్రపంచం ఇప్పుడు అత్యంత ఘోరమైన స్థితిలో ఉందన్న సంకేతం. గతంలో అణు యుద్ధాల భయం ఉన్నప్పుడు కూడా ఈ గడియారం ఇంత దగ్గరకి రాలేదు. శీతల యుద్ధ కాలంలో కూడా కొంచెం వెనుకే ఉండేది.
ఇప్పుడు మాత్రం అణు ఆయుధాలే కాదు, వాతావరణ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, అంతర్జాతీయ ఒప్పందాల పతనం లాంటివి అన్నీ కలసి ఒకేసారి మానవజాతిని ఒత్తిడి తెస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. ఒక దేశంలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు వాతావరణ విపత్తులు వస్తున్నాయి. అదే సమయంలో అణు ఆయుధాలపై నియంత్రణ తగ్గుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైనిక నిర్ణయాల్లోకి వస్తోంది. ఈ మొత్తం వ్యవస్థను నియంత్రించాల్సిన అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాలు బలహీనపడుతున్నాయి. అందుకే ఈసారి గడియారం ముందుకు కదిలింది. ఇలా అర్థరాత్రికి 85 సెకన్ల దూరంలో ముల్లు ఆగడమంటే భూమికి చివరి క్షణాలని అర్థం కాదు కానీ చివరి అవకాశమని హెచ్చరిక.
మనం తీసుకునే నిర్ణయాలు, దేశాలు చూపించే బాధ్యత, సైన్స్పై రాజకీయాల ప్రభావం తగ్గితే ఈ గడియారం మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందని కూడా అదే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఈ గడియారం మానవజాతికి ఇచ్చిన చివరి వార్నింగ్ బెల్ లాంటిది. మరి ఈ హెచ్చరికను మనం పట్టించుకుంటామా? లేదా అర్థరాత్రి వచ్చే వరకు చూస్తూ ఉండిపోతామా?
ALSO READ: హైదరాబాద్ ఊపిరి ఆగుతోంది.. బాం*బు పేల్చిన IIT కాన్పూర్ అధ్యయనం!
