Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్‌.. భారీ నాయకత్వ మార్పులు వైపు అడుగులు?

Congress Prepares For 2029 Lok Sabha Elections Explained

Congress Prepares For 2029 Lok Sabha Elections Explained

కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సాఫీగా ముగిసిన తర్వాత.. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు భారీ సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి సారించింది. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకంగా ఆరు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను మార్చడంతో పాటు, ఏఐసీసీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తోంది. అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఏయే రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి? పార్టీ భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండబోతోంది?

పీసీసీ చీఫ్‌లను మార్చుతారా?

కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు కీలక అడుగులు వేస్తోంది. కర్ణాటకలో నాయకత్వ సమస్యను విజయవంతంగా పరిష్కరించిన తర్వాత.. హైకమాండ్ ఇప్పుడు ఇతర రాష్ట్రాల కమిటీల పునర్నిర్మాణంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకత్వానికి.. కొత్త ముఖాలకు పార్టీలో పెద్దపీట వేయాలని రాహుల్ గాంధీ గట్టిగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ స్థాయిలో కూడా అంచనాల మేరకు పనితీరు కనబర్చని పలువురు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పులపై రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల మధ్య ఇప్పటికే సుదీర్ఘ చర్చలు జరిగాయి.

×
×
Ad

తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌పై వేటు?

కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎంగా ప్రమోట్ అవ్వడంతో అక్కడ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అనివార్యమైంది. కర్ణాటక పీసీసీ చీఫ్ రేసులో సతీష్ జార్కిహోళి ముందు వరుసలో ఉండగా బీకే హరిప్రసాద్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇక కేరళలో కూడా ప్రస్తుత చీఫ్ సన్నీ జోసెఫ్ మంత్రివర్గంలో చేరడంతో కొత్త అధ్యక్షుడి కోసం ముమ్మర లాబీయింగ్ జరుగుతోంది. కొడికున్నిల్ సురేష్, బెన్నీ బెహనాన్ వంటి సీనియర్ నేతలు ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

పంజాబ్‌లో ఫిబ్రవరి 2027 ఎన్నికల లోపు పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకురావాలని పార్టీలోని ఒక వర్గం గట్టిగా కోరుతోంది. పంజాబ్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు.. వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇక రాజస్థాన్‌లో 2020 నుంచి చీఫ్‌గా ఉన్న గోవింద్ సింగ్ దోటస్రా, యూపీలో అజయ్ రాయ్ స్థానాల్లో మార్పులు అవసరమా అన్నదానిపై సమీక్ష జరుగుతోంది.

పార్టీ అంతర్గత మార్పులతో పాటుగా ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనా కాంగ్రెస్ తీవ్రంగా దృష్టి సారించింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో చేరడం… కూటమికి డీఎంకే రాంరాం చెప్పడంతో… దానిని పటిష్టం చేసే బాధ్యతను కాంగ్రెస్ భుజానికెత్తుకుంది. జూన్ 8న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగుస్తుంది. అభ్యర్థుల ఎంపికపై తమిళనాడు.. జార్ఖండ్ మిత్రపక్షాలతో కాంగ్రెస్ ముమ్మర చర్చలు జరుపుతోంది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీతో బేరసారాలు ఆడుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో నీట్, సీబీఎస్ఈ వంటి విద్యార్థి సంబంధిత సమస్యలపై రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

: ఫణి కుమార్ (NTV DIGITAL)