అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలల్ని పంచుకున్నారు.
ఈ సినిమా కథ అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ కోసం మొదలైయిందని విన్నాం ?
-పాక్ జైలు లో ఒక సెంట్రి అల్లు అర్జున్ గారి ఫ్యాన్. వాళ్ళు మన తెలుగు సినిమాలు గట్టిగా చూస్తారు. 22 మంది మత్య్సకారులు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.
కథ విన్నప్పుడు లవ్ స్టోరీ చేద్దామని ఎందుకు అనిపించింది?
వాస్తవిక సంఘటనలతో కూడుకున్న కాల్పనిక ప్రేమకథ. ఇందులో ఇన్సిడెంట్ వాస్తవం. మత్య్సలేశ్యం నుంచి గుజరాత్ వెళ్ళడం అక్కడ నుంచి పాక్ సరిహద్దుల్లో దొరకడం, వారి కోసం పోరాటం.. ఇదంతా వాస్తవం. దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే రియల్ పేర్లు పెట్టలేదు. మొదట ఈ కథ విన్నప్పుడు పాక్ నేపధ్యంలో చేద్దామని అనుకున్నాను. కానీ అలోచించగా చూస్తే ఇందులో బ్యూటీఫుల్ ఎమోషన్ వుంది. ఈ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అందుకే మెదట నుంచి ఈ సినిమా మేము ఎమోషనల్ లవ్ స్టొరీ అనే ప్రమోట్ చేశాం. ఇది ప్యూర్ లవ్ స్టొరీ.
పాక్ జైలు ఎపిసోడ్స్ ట్రిమ్ చేశారా ?
-ఈ సినిమాఎంతసేపు చెబితే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే అంశంపై మా టీం అంతా చాలా క్లారిటీగా వున్నాం. కొంతమంది ఆడియన్స్ పాక్ ఎపిసోడ్ ఇంకా వుంటే బావున్ననే ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేశారు. ప్రతి ఎలిమెంట్ కి ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు.
తండేల్ లో చైతు గారి ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా వుండేది ?
-ఇందులో ప్రతి షాట్ నా బ్రెయిన్ లో వుంది. ప్రతిది ఓ కొలమానం లోనే చేశాను. పెళ్లి కార్డ్ సీన్ లో కేవలం అతనికి మాత్రమే తెలిసేలా కళ్ళని చూపించాం. అక్కడ నుంచి ప్రతి షాట్ డిజైన్ చేశాం. ఆ సీన్ కి థియేటర్ మొత్తం ఊగిపోయింది.
పాక్ ఎపిసోడ్స్ కి సెన్సార్ సమస్యలు వచ్చాయా?
-చాలా వచ్చాయి. గ్లింప్స్ లో జెండా చూపించడానికే ఒప్పుకోలేదు. డైలాగ్స్, మ్యుట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి. ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది. అయితే అది వారి డ్యూటీ. మా వరకు మా బెస్ట్ ఇచ్చాం.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ?
-ఈ కథని దేవిశ్రీ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదు. ప్రతి సీన్ మ్యూజిక్ ని ఆయన ముందే ఊహించుకున్నారు. కథలోని ప్రతి ఎమోషన్ పై ఆయనకి పట్టువుంది. పాటలల్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నేపధ్యం సంగీతంతో ఆద్యంతం కట్టిపడేశారు.
సినిమా పైరసీ బారిన పడినప్పుడు ఎలా ఫీలయ్యారు ?
-గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది. ఆ బాధ మాటల్లో చెప్పలేను. సినిమాని ఒక థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తాం. అలాంటిది పైరసీ బారిన పడటం చాలా బాధాకరం. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపొయినంత బాధగా ఉటుంది. చాలా పెయిన్ ఫుల్.