Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్‌న్యూస్..ఇండియాలో వర్షాలు..!

Weather news

Weather news

 Monsoon Alert: ఇక్కడ నేల మండుతుంటే..అక్కడ భూమి తడుస్తోంది..! అవును..! ఇండియాలో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మే నెల వచ్చిందంటే ఇండియా అంతటా మండిపోవాలి.. నేల చిట్లిపోవాలి.. గాలే నిప్పులా కాలిపోవాలి.. కానీ ఈసారి ప్రకృతి వేరే కథ రాస్తోంది.

ఆకాశం ఒక్కసారిగా మారిపోతోంది. తమిళనాడు(Tamilnadu) మీద ఉరుములు గర్జిస్తున్నాయి. కేరళ(Kerala)లో మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. ఎండాకాలం మధ్యలోనే వర్షపు వాసన దేశాన్ని తాకడం మొదలైంది. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది?

మాన్సూన్ ఎప్పుడంటే?

ఈసారి మాన్సూన్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా మారింది. ఇండియాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు భారత మాన్సూన్ భవిష్యత్తును చెబుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారత్‌లో కురిసే వర్షాలకు ఆస్ట్రేలియా వాతావరణంతో నేరుగా సంబంధం ఉంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఉరుములు, భారీ వర్షాలు ఒక పెద్ద మార్పుకు సంకేతాలు. ఒకవైపు వేడి. మరోవైపు ఒక్కసారిగా పిడుగులు, గాలివానలు, వడగళ్ల వానలు..ఈ ప్యాటర్న్ చూస్తుంటే మాన్సూన్ సమీపిస్తున్నదని అర్థమవుతుంది. అందుకే ఈసారి కూడా జూన్ ఒకటో తేదీకి కేరళ తీరాన్ని మాన్సూన్ తాకే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇటు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. 2025 నుంచి 2026 వరకు ఉత్తర ఆస్ట్రేలియాలో ఉండే వెట్ సీజన్ అధికారికంగా ముగిసిందని చెప్పింది. సాధారణంగా ఇది అక్కడి స్థానిక వార్తలా కనిపిస్తుంది కానీ ఆసియా మాన్సూన్‌ను గమనించే శాస్త్రవేత్తలకు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకు ఇండియాకు లింకేంటి?

ఆస్ట్రేలియాలో వర్షకాలం ముగియడం అంటే భారత మాన్సూన్‌కు మార్గం క్లియర్ కావడమని అర్థం. దీని వెనుక ఉన్న సైన్స్‌ను ముందుగా అర్థం చేసుకోవాలి. భూమధ్యరేఖ దగ్గర ప్రపంచాన్ని చుట్టుకుంటూ ఉండే ఒక కనిపించని మేఘాల బెల్ట్ ఉంటుంది. ఇది సూర్యుడి కదలికను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం ఉత్తరానికి దక్షిణానికి మారుతూ ఉంటుంది. ఈ బెల్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను తీసుకెళ్తుంది. అదే ఇండియాకు మాన్సూన్‌ను తెస్తుంది. సాధారణంగా దక్షిణ అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు ఈ బెల్ట్ ఆస్ట్రేలియా వైపు ఉంటుంది. అందుకే అక్కడ భారీ వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు అక్కడి వెట్ సీజన్ ముగిసింది. అంటే ఆ బెల్ట్‌పై ఆస్ట్రేలియా ప్రభావం తగ్గిపోయింది. దీంతో అది మెల్లగా ఉత్తర దిశగా కదలడం మొదలుపెట్టింది. ఇదే భారత మాన్సూన్ ప్రారంభానికి అసలు కారణం.

ఈ భారీ మేఘాల బెల్ట్ ఇప్పుడు భూమధ్యరేఖ దాటి మాల్దీవుల వైపు చేరుకుంది. అక్కడి నుంచి శ్రీలంక మీదుగా అండమాన్ నికోబార్ దీవుల దిశగా కదులుతోంది. ఇదే మాన్సూన్ ప్రతి సంవత్సరం తీసుకునే సంప్రదాయ మార్గం. అక్కడి నుంచి అది కేరళ తీరాన్ని తాకుతుంది. ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తుంది. ప్రతి సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ వరకు ఇండియా వర్షాలతో నిండిపోతుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా పొడిగా మారుతుంది. సెప్టెంబర్ చివరికి పరిస్థితి తిరగబడుతుంది. మేఘాల బెల్ట్ మళ్లీ దక్షిణ దిశగా కదులుతుంది. భారత మాన్సూన్ వెనక్కి వెళ్లిపోతుంది. ఆస్ట్రేలియాలో మళ్లీ వర్షకాలం మొదలవుతుంది. ఇది భూమి, సూర్యుడు, సముద్రాలు కలిసి నడిపే ఒక మహా సహజ చక్రం. ఇప్పుడు అన్ని సంకేతాలు ఒకే దిశగా చూపిస్తున్నాయి. గాలులు మారుతున్నాయి. మేఘాలు ఉత్తర దిశగా పయనిస్తున్నాయి.

సముద్రాల నుంచి తేమతో నిండిన గాలులు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. అంటే కోట్లాది రైతులు ఎదురు చూస్తున్న వర్షకాలం ఇక చాలా దగ్గర్లో ఉందని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే భారత మాన్సూన్ తన మహా ప్రవేశానికి సిద్ధమైందని క్లియర్‌ కట్‌గా చెప్పవచ్చు.