Yuvraj Singh Retirement: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. జట్టు నుంచి తనను తప్పించిన మేనేజ్మెంట్పై అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ తనను ఎందుకు పక్కన పెడుతున్నారో కనీసం వివరణ సైతం ఇవ్వలేదన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎంఎస్ ధోనీ తనకు వివరణ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. “ఆ సమయంలో నాకు ఎవరి నుంచి స్పష్టత రాలేదు. ఎన్సీఏ (NCA), కెప్టెన్ లేదా కోచ్ ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. ఆ టైమ్లో నా ఏజ్ 36-37 ఏళ్లు. చాలా ఏళ్లు దేశం కోసం ఆడాను. చివరివరకు కనీస గౌరవం దక్కాలని ఆశించాను. నాకు సరైన గౌరవం దక్కలేదు. ఈ టైమ్లో నేను ధోనీకి ఫోన్ చేశాను. ధోనీ కెప్టెన్గా లేడు. ఆ నిర్ణయాలతో అతనికి సంబంధం లేదు. టీమ్లో ఏం జరుగుతుందో ధోనీ గమనించాడు. సెలక్టర్లు నా వైపు చూడటం లేదని ధోనీ నాకు వివరణ ఇచ్చాడు.” అని యువీ ఆవేదన వ్యక్తం చేశాడు.
READ MORE: VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!
తాను రిటైర్మెంట్ అవ్వాలని మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చినట్లు యువరాజ్ సింగ్ వివరించాడు. “మేనేజ్మెంట్ నన్ను రిటైర్ అవ్వాలని ఒత్తిడి తెచ్చింది. నువ్వు ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ కాలేదు.. కాబట్టి తప్పుకోవాలని చెప్పింది. ఆడించాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ రిటైర్ అవ్వాలా వద్దా అనేది నా వ్యక్తిగత నిర్ణయం అని వాళ్లకు చెప్పాను.” అని యువీ తెలిపాడు. ఇక 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యువరాజ్, 2019లో ఆటకు వీడ్కోలు పలికారు. 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అనేక అద్భుతాలు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 398 మ్యాచ్లు ఆడి 11,000 పైగా పరుగులు సాధించాడు. భారత్ తొలి టీ20 ప్రపంచకప్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లోనే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు.
