మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో కొనసాగుతున్న కరువు, సాగునీటి కొరత, రైతుల సమస్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని పూర్తిగా వినియోగిస్తే రాయలసీమకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు సాగునీటి విషయంలో భరోసా కల్పించేందుకే తమ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి కూడా రాయలసీమకు ఒక్క చుక్క నీరు అందడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ పనులు, బుగ్గమాధారం వద్ద రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా సాగుతున్నాయని జగన్ ప్రస్తావించారు.
కరువు పరిస్థితులతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు, రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రైతులకు సంబంధించిన బీమా వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు వచ్చాయని, ఇప్పుడు సుమారు 40 లక్షల దరఖాస్తులకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. పంటల బీమా ప్రీమియాన్ని కూడా రైతులే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీమియం చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అలాగే తుఫాన్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందలేదని జగన్ విమర్శించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక వ్యవస్థలను ప్రభుత్వం బలహీనపరిచిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని పేర్కొన్నారు. పీఎం కిసాన్కు అదనంగా అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్కో రైతుకు రావాల్సిన ప్రయోజనాల్లో లోటు చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు జూన్, జూలై నెలల్లోనే 52 శాతం వరకు నమోదైనప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని జగన్ ప్రశ్నించారు. అప్పుడే అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ఉచిత విత్తనాలు పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
పంటలు వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏ విధమైన సహాయం చేసిందో చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్లో వర్షాలు పడినా అప్పటికే నష్టపోయిన పంటలకు ప్రయోజనం ఉండదన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతు కూలీలకు కూడా తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.తమపై తప్పుడు ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతోందని విమర్శించారు. కరువును ఎదుర్కొనే చర్యలు, రైతులను ఆదుకునే ప్రణాళికలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని అన్నారు. ‘ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తున్నాం?’ అని చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కరువు మరింత తీవ్రం కావచ్చన్న పరిస్థితుల్లో రైతులకు సాగునీరు, బీమా, విత్తనాలు, గిట్టుబాటు ధర, ఉపాధి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

