YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..

Ys Jagan Monhan Reddy Ap

Ys Jagan Monhan Reddy Ap

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మధ్యాహ్నం జరగనున్న ఒక వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన నగారానికి చేరుకుంటున్నారు. జగన్ రాకను పురస్కరించుకుని ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నగరంలో అడుగడుగునా ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి జలవిహార్ వరకు ప్రధాన మార్గాల్లో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

ఈ స్వాగత ఏర్పాట్లలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏంటంటే, వైఎస్ జగన్‌తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రాలను ఒకే కటౌట్‌లో పొందుపరచడం. ‘ధీరుడు వైఎస్ జగన్‌కు స్వాగతం’, ‘వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది’ అనే ఆకట్టుకునే నినాదాలతో కూడిన ఈ బ్యానర్లు నగరంలో వెలిసి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, సమీకరణాలను ప్రతిబింబించేలా ఈ కటౌట్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ భారీ ఫ్లెక్సీలు అటుగా వెళ్లే బాటసారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

కేవలం వ్యక్తిగత శుభకార్యానికి హాజరుకావడానికే వచ్చినప్పటికీ, విపక్ష నాయకులు జగన్‌కు ఈ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేయడం విశేషం. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ హైదరాబాద్ రావడం, ఆయనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా కటౌట్లు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న రాజకీయ కోణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. జగన్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంమీద జగన్ నగర పర్యటన ఒక శుభకార్యానికి సంబంధించినదే అయినప్పటికీ.. నగరంలో కనిపించిన స్వాగత తోరణాలు, కటౌట్లు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త వాతావరణాన్ని తీసుకొచ్చాయి.