NTV Telugu Site icon

Crime: మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా.. పట్టపగలు యువకుడి దారుణ హత్య

Crime News

Crime News

Crime News: ఓ యువ‌తిని ప్రేమించిన యువ‌కుడు.. త‌మ పెళ్లికి అంగీక‌రించాల‌ని ఆమె కుటుంబ స‌భ్యుల‌ను కోరగా.. మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా అంటూ యువతి బంధువులు ఓ బడుగు వర్గానికి చెందిన యువకుడిని ప‌ట్టప‌గ‌లే వెంటాడి క‌త్తుల‌తో న‌రికి చంపిన‌ దారుణ ఘ‌ట‌న ఆదివారం చోటుచేసుకుంది. న‌ల్గొండ జిల్లా జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లంలోని గుంటిపల్లిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త్రిపురారం మండలం జి.అన్నారం గ్రామానికి చెందిన విరిగి నవీన్‌ (21) చదువును మధ్యలోనే మానేసి మిర్యాలగూడలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈట నాగయ్య కుటుంబం మిర్యాలగూడలోనే నివాసం ఉంటూ అక్కడే కూరగాయల వ్యాపారం చేస్తోంది.

నాగయ్య కుమార్తె, నవీన్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావ‌డంతో రెండువైపుల కుటుంబాలూ వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. వీరి ప్రేమ వ్యవహారం ఏడాది కిందట తెలియడంతో అమ్మాయిని మర్చిపోవాలని లేకుంటే హత్య చేస్తామని ఆమె కుటుంబసభ్యులు బెదిరించారు. అందుకు భయపడకుండా నవీన్‌ తాము వివాహం చేసుకుంటామని వారికి చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నవీన్‌ గుంటిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు అనిల్, తిరుమల్‌తో కలిసి ఊళ్లో ఓ ఇంటి వద్ద మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారంపై మాట్లాడుకుందామని అమ్మాయి తరఫు బంధువులకు తిరుమల్ ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. సరే వస్తున్నామని చెప్పిన కుటుంబసభ్యులు కాసేపటికే మూడు బైక్‌లపై 9 మంది కత్తులతో అక్కడికి చేరుకున్నారు.

Read Also: Fake Notes Gang Atrocities: ఒకరిని చంపి.. కాలువలో పడేసి…నకిలీ నోట్ల ముఠా ఆగడాలు.

వస్తూనే నవీన్‌పై దాడికి దిగారు. స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న నవీన్‌పై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అనిల్, తిరుమల్‌ భయంతో పారిపోగా పరుగెత్తుతున్న నవీన్‌ను వారు వెంటాడి కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. స‌మాచారం అందుకున్న డీఎస్పీ వెంక‌ట‌గిరి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడి మిత్రుడు అనిల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.