పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘరామకృష్ణరాజును తరలించారు. ఆయన వస్తున్న సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశాడని 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయన న్యాయస్థానం ద్వారానే బెయిల్ పొందేందుకు వీలుంది అని పేర్కొంటూ సీఆర్పీసీలోని సెక్షన్ 50(2) ప్రకారం నోటీసు జారీచేశారు.
గుంటూరు సీఐడీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే అవకాశం వుంది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు జస్టిస్ సురేష్ రెడ్డి రఘురామకృష్ణరాజు హౌజ్ మోషన్ పిటీషన్ పై వాదనలు వింటారు. రఘురామకృష్ణరాజు తరఫున అడ్వకేట్ గా బండారుపల్లి ఆదినారాయణ వాదనలు వినిపించనుండగా.. సీఐడీ తరఫున అడ్వకేట్ గా సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.