కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచిందని.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే.. తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. ‘వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుంది. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు.. గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచింది.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనే. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నాం. వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఇవాళ యాదృచ్చికంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయి’ అని అన్నారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్కు ఏడాదికి రూ.2800 కోట్లు కావాలి. వసతి దీవెనకు రూ.1100 కోట్లు కావాలి. ఈ ప్రభుత్వం గత ఏడాది రూ.700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంది. పిల్లలకు కావాల్సిన కేటాయింపులు చేయాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది.. ప్రజల గొంతుకగా పోరాడుతుంది. ఇవాళ యువత పోరుబాటలో పాల్గొంటున్న యువత, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా వైసీపీతో కలసి నడుస్తున్న ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా’ అని వైఎస్ జగన్ చెప్పారు.