ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఓపెనర్ యష్ ధుల్ అద్భుత శతకంతో చెలరేగాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పురానీ ఢిల్లీ 6 జట్టుతో జరిగిన మ్యాచ్లో 23 ఏళ్ల ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇది అతనికి డీపీఎల్లో రెండో సెంచరీ. తన శతకంతో పాటు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పురానీ ఢిల్లీ 6 నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ బౌలర్ మనీ గ్రేవాల్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి పురానీ ఢిల్లీ టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఒకానొక దశలో పురానీ ఢిల్లీ 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ అనుజ్ రావత్ (5), ఆర్యన్ గౌడ్ (2), దేవ్ లాక్రా (3), లలిత్ యాదవ్ (5) విఫలమయ్యారు. అయితే రోహన్ రాఠీ (21 బంతుల్లో 46), వికెట్ కీపర్ అశ్విని చిల్లా (29 బంతుల్లో 38) ఆరో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 13.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రారంభంలో సిద్ధార్థ్ జూన్ నిమ్మదించినా, ధుల్ నాలుగో ఓవర్లో రజనీష్ దాదర్ బౌలింగ్లో 23 పరుగులు, తదుపరి ఓవర్లో దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో మరో 23 పరుగులు రాబట్టి గేర్ మార్చాడు. ధుల్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిద్ధార్థ్ (8) అవుట్ అయిన తర్వాత, యుగళ్ సైని (21 బంతుల్లో నాటౌట్ 27) తో కలిసి ధుల్ రెండో వికెట్కు విడదీయరాని 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దిగ్వేష్ రాఠీ వేసిన 14వ ఓవర్లో ధుల్ రన్ తీసి తన సెంచరీని, జట్టు విజయాన్ని ఒకేసారి ఖాయం చేశాడు. ఈ విజయంతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

