ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లోని తొలి పోరులో పాకిస్థాన్ 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్థాన్కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. వెస్టిండీస్తో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాయింట్ల పట్టిక స్థానాల్లో ఎలాంటి పెద్ద మార్పులు లేవు. పాకిస్థాన్ ఆడిన 5 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, 6.67 గెలుపు శాతంతో 9 జట్ల పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ జట్టు ఈ విజయంతో తన గెలుపు శాతాన్ని స్వల్పంగా పెంచుకున్నప్పటికీ 22.73 శాతంతో 8వ స్థానంలోనే ఉంది.
మరోవైపు ఈ సైకిల్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి 87.50 గెలుపు శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఛాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్లలో 3 గెలిచి 75 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్లలో 4 విజయాలతో 72.22 శాతంతో మూడో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 4 మ్యాచ్లలో 2 గెలిచి 58.33 శాతంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లలో 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో 48.15 గెలుపు శాతాన్ని కలిగి ఉంది. శ్రీలంక జట్టు 41.67 గెలుపు శాతంతో ఆరో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ జట్టు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం 4 మాత్రమే గెలిచి 24.36 గెలుపు శాతంతో ఏడో స్థానంలో పరిమితమైంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఈ డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాయి. ప్రస్తుత సైకిల్ ఫైనల్ పోరు 2027లో ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానంలో జరగనుంది.

