Telangana CID: మోసం చేసి తప్పించుకుంది.. 36 ఏళ్ల తర్వాత సీఐడీకి చిక్కింది..

Cid

Cid

Telangana CID: మోసం కేసులో తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను 36 ఏళ్ల తర్వాత అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ట్రావెన్‌కోర్‌ ఫైనాన్స్‌ కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితురాలుగా ఉన్న మరియమ్మ అలియాస్‌ లీలమ్మ జోసెఫ్‌ను 36 ఏళ్ల తర్వాత కేరళలో అరెస్ట్ చేశారు.. ఆమె వయస్సు ఇప్పుడు 69 ఏళ్లు.. సోమవారం అరెస్టు చేసిన తెలంగాణ సీఐడీ పోలీసులు.. నిన్న కోర్టులో హాజరుపర్చారు. 1987లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా తుల్లపల్లికి చెందిన మరియమ్మను అరెస్ట్‌ చేశారు.. 1987లో ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు సీసీఎస్‌లో నమోదైంది. తర్వాత ఇది సీఐడీకి బదిలీ చేశారు.. ఈ కేసులో 11వ నిందితురాలిగా ఉన్న మరియమ్మ పరారీలోనే ఉండడంతో.. ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే, మహేష్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెండింగ్ కేసులనీ ఫోకస్‌ పెట్టారు.. ఇందులో భాగంగా మరియమ్మపై కేసు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.. దాంతో సీఐడీ ఎస్పీ బి. రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. మరియమ్మ కేరళలో ఉన్నట్లు కనిపెట్టారు.. ప్రత్యేక బృందం కేరళ వెళ్లి ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.. న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.