Wife Killed Husband: ఈ మధ్యకాలంలో భర్తలపై భార్యలు చేస్తుస్తున్న ఘోరాలు రోజురోజుకు ఎక్కువతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను అజయ్ అనే యువకుడి భార్య, ఆమె ప్రియుడు, మరో యువకుడు కలిసి చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం ఆధారాలను దాచిపెట్టేందుకు నిందితులు శవాన్ని బైక్ కింద పెట్టి ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 8న డయల్ 112 ద్వారా రజనియా కట్రా గ్రామం సమీపంలోని అడవిలో రోడ్డుకి పక్కన ఒక యువకుడి శవం బైక్ కింద ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో మృతుడు ఖంతరా గ్రామానికి చెందిన అజయ్ వైశ్య (24)గా గుర్తించారు.
దీనితో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అతని సోదరుడు వినయ్ వైశ్య అక్కడికి చేరుకున్నాడు. అజయ్ కు ఫిబ్రవరి 12న గన్నై గ్రామానికి చెందిన ఉమా వైశ్యతో వివాహం జరిగినట్లు తెలిపారు. మార్చి 7 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అజయ్ తన అత్తింటి గన్నై గ్రామానికి మోటార్సైకిల్పై వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. అయితే అతను అక్కడికి చేరకపోవడంతో పాటు తిరిగి ఇంటికీ రాలేదు. అయితే మరుసటి రోజు అతని మరణ వార్త వారికి తెలిసింది.
సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించగా ఆ ఘటన అనుమానాస్పదంగా కనిపించింది. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయి. అలాగే మోటార్ సైకిల్ ను ప్రమాదంలా కనిపించేలా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలను సేకరించారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ మనీష్ ఖత్రి నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రూ.10 వేల బహుమతిని ప్రకటించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఉమా వైశ్యను పోలీసులు విచారించగా ఆమె నిజం ఒప్పుకుంది. పెళ్లికి ముందే తనకు అమర్ బహాదూర్ వైశ్యతో ప్రేమ సంబంధం ఉన్నట్లు, అతనితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. కానీ కుటుంబ ఒత్తిడితో తనను అజయ్తో వివాహం చేసుకున్నానని, అందువల్ల తాను సంతోషంగా లేనని వెల్లడించింది.
YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!
ఈ కారణంగానే ఉమా తన ప్రియుడు అమర్ బహాదూర్ వైశ్యతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. ప్లాన్ ప్రకారం మార్చి 7న ఉమా అజయ్ ను కలవాలని చెప్పి తన పుట్టింటికి రావాలని పిలిచింది. ఆ తర్వాత అతను వస్తున్నాడని తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో అమర్ బహాదూర్ తన సహచరుడు చంద్రప్రతాప్ అలియాస్ చందన్ వైశ్యతో కలిసి బొలెరో వాహనంలో అక్కడికి వచ్చి అజయ్ను వెంబడించారు. రాత్రి సుమారు 9 నుంచి 10 గంటల మధ్య రజనియా కట్రా అడవిలోని ఓ ప్రాంతంలో నిందితులు అజయ్ మోటార్ సైకిల్ ను ఆపి.. అనంతరం మెడికల్ గ్లోవ్స్ ధరించి గమ్ఛాతో అతని గొంతు నులిమి, రాయితో తలపై పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
హత్య అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు మృతదేహం దగ్గర మోటార్ సైకిల్ ను ఉంచారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, ఘటనలో ఉపయోగించిన బొలెరో వాహనం సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా జైలుకు తరలించారు.
