NTV Telugu Site icon

Sanju Samson: 9 ఏళ్ల బాధను బయటపెట్టిన సంజూ శాంసన్!

Sanju Samson

Sanju Samson

Sanju Samson brings out pain of last 9 years in Indian Cricket: కేరళ వికెట్ కీపర్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై బీసీసీఐ ఎప్పుడూ చిన్న చూపు చూస్తుందనే అపవాదు ఉంది. దేశవాళీ, ఐపీఎల్‌లో బాగా ఆడినా సంజూను జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయరని.. మిగతా క్రికెటర్లకు వచ్చినన్ని అవకాశాలు మాత్రం సంజూకు రాలేదనేది కొందరి అభిప్రాయం. అతడు ఆడిన మ్యాచుల సంఖ్య చూస్తే ఇదే నిజం అని అనకుండా ఉండలేం. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన సంజూ.. ఇప్పటివరకు 13 వన్డేలు, 17 టీ20లు మాత్రమే ఆడాడు. దాంతో సంజూకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని ఫాన్స్ ఎప్పుడూ బీసీసీఐపై మండిపడుతుంటారు.

ఏదేమైనా సంజూ శాంసన్‌ అడపాదడపా జట్టులో స్థానం సంపాదిస్తున్నాడే కానీ.. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడలేదు. మెగా టోర్నీల్లో ఆడాలంటే ముందుగా జట్టులో స్థానం దక్కాలి. అది జరగాలంటే వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో చివరగా వచ్చిన అవకాశంను శాంసన్ ఒడిసిపట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో నెంబర్ 4 స్థానానికి తాను సరిగ్గా సరిపోతానని చాటి చెప్పాడు. ఆసియా కప్ 2023, ప్రపంచకప్‌ 2023 టోర్నీలలో తాను పోటీలో ఉన్నానని బీసీసీఐకి గుర్తు చేశాడు.

Also Read: Ishan Kishan: మూడు వన్డేలలో హాఫ్ సెంచరీ చేసినా.. హ్యాపీగా లేను: ఇషాన్‌ కిషన్‌

తాజాగా వెస్టిండీస్‌తో మూడో వన్డే అనంతరం సంజూ శాంసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో భారత జట్టులో స్థానం కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ‘ఓ భారత క్రికెటర్‌గా ఎప్పుడూ సవాళ్లు ఉంటాయి. గత 9 ఏళ్లుగా భారత్ తరపున, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూనే ఉన్నా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. అంతర్జాతీయంగా ఆడేటప్పుడు విభిన్న స్థానాల్లో ఆడాల్సి ఉంటుంది. ఎన్ని ఓవర్లు ఆడుతామని చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా పరిస్థితులకు తగ్గట్టుగా సన్నద్ధం కావాల్సిందే’ అని సంజూ తెలిపాడు.

‘మూడో వన్డేలో క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా. దాంతో బంతి గమనంపై ఓ అంచనా వచ్చింది. భారత్‌ తరఫున మంచి ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం దక్కింది. ప్రత్యర్థి బౌలర్‌ను బట్టి నా ప్రణాళికలు ఉంటాయి. బౌలర్ల లెంగ్త్‌ను డామినేట్‌ చేయడానికి నా పాదాల కదలికను ఎప్పటికపుడు మారుస్తూ ఉంటా. రెండో వన్డే ఆడిన పిచ్‌కు.. ఈ పిచ్‌కు వ్యత్యాసం ఉంది. ఇక్కడ కొత్త బంతి చక్కగా బ్యాట్‌ మీదకు వచ్చింది. బంతి పాతబడ్డాక బౌలర్లకు అనుకూలంగా మారింది. అప్పుడు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాం. మిడిలార్డర్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరు చేసింది’ అని సంజూ చెప్పుకోచ్చాడు.

Also Read: Crocodile Attack: అదృష్టం అంటే ఈమెదే.. మొసలి నోటికి చిక్కి, గంట తర్వాత బతికి బయటపడింది