Monsoon 2026: జూన్ 4న భారత గడ్డను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఆరంభంలో అదరగొట్టినా, ఆ తర్వాత ఒక్కసారిగా బ్రేక్ పడి స్తంభించిపోయాయి. తొలకరి పలకరింపుతో మురిసిపోయిన రైతులకు, నీటి యాజమాన్య అధికారులకు ఈ హఠాత్ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడానికి కారణమేంటని ఆరా తీస్తే.. ఇది కేవలం ఏదో ఒక వాతావరణ మార్పు వల్ల జరిగింది కాదని, పలు సంక్లిష్ట వాతావరణ శక్తుల మాయాజాలమని వాతావరణ నిపుణులు తేల్చారు. పసిఫిక్ అలజడులు, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్, బలహీనమైన అల్పపీడన ద్రోణి, మ్యాడెన్-జూలియన్ ఆసిలేషన్ (MJO) సహకారం కరువవ్వడం, దూసుకొస్తున్న ఎల్ నినో వంటివన్నీ కలిసి రుతుపవనాల పురోగతికి పెద్ద గోడలా అడ్డుపడ్డాయి.
ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం పోషించింది. జూన్ ప్రారంభంలో హిందూ మహాసముద్రంలో రుతుపవనాల కదలికలు బాగానే మొదలైనప్పటికీ, అందులోని కొంత శక్తి పసిఫిక్ వైపు మళ్లింది. అక్కడ తదుపరి కాలంలో జగ్మి అనే టైఫూన్గా మారిన ఉష్ణమండల చలనాలతో ఈ శక్తి ముడిపడిపోయింది. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే అది రుతుపవనాలను దేశం నలుమూలలా ముందుకు నడిపిస్తుంది. కానీ, ఇక్కడే ఆ వాతావరణ శక్తి కాస్తా తూర్పు వైపునకు మళ్లడంతో బంగాళాఖాతంలో ఆశించిన అల్పపీడనం పుట్టుక రాలేకపోయింది. మరోవైపు, ఉత్తర భారతదేశం మీదుగా అసాధారణంగా దక్షిణ దిశగా దూసుకొచ్చిన వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ (పశ్చిమ అల్లకల్లోలాలు) పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఇవి నిరంతరాయంగా పొడి పశ్చిమ-ఉత్తర గాలులను ఈ ప్రాంతంలోకి మోసుకొచ్చాయి. ఈ పొడి గాలుల వల్ల దట్టమైన మేఘాలు కమ్మేందుకు, వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం దెబ్బతింది. ఇక ఉపఖండం అంతటా విస్తరించాల్సిన రుతుపవన ద్రోణి (భారీ అల్పపీడన పట్టీ) సైతం తన సహజ సిద్ధమైన స్వభావాన్ని కోల్పోయింది. ఈ ద్రోణి వెంబడి ఒక చైతన్యవంతమైన వాతావరణ సుడి (సైక్లోనిక్ సర్క్యులేషన్) ఏర్పడినప్పటికీ, అది బంగాళాఖాతం నుంచి తేమను లోపలికి లాగడానికి బదులుగా, గాలులను ఆ ద్రోణి చుట్టూనే తిరిగేలా చేసింది. దీనివల్ల పిడుగులతో కూడిన తుఫానులు సరిగ్గా కేంద్రీకృతం కాలేకపోయాయి, ఫలితంగా కనీసం ఒక సాధారణ అల్పపీడన ప్రాంతం (LPA) కూడా ఏర్పడటం కష్టంగా మారింది.
పసిఫిక్ అలజడులు పెరిగేకొద్దీ పరిస్థితి మరింత దిగజారింది. వాతావరణ పటాల ప్రకారం.. గాలులు వలయాకారంలో కాకుండా పశ్చిమం నుండి తూర్పునకు సరళరేఖలా (స్ట్రెయిట్గా) సాగాయి. సాధారణంగా తేమను ఒకచోటకు చేర్చి, మేఘాలు పైకి లేవడానికి గాలులు వంపులు తిరుగుతూ కేంద్రీకృతం కావాలి. కానీ ఇక్కడ గాలులు రుతుపవన ద్రోణికి సమాంతరంగా సాగడంతో ఆ ప్రక్రియ పూర్తిగా బలహీనపడి, బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలను తుడిచిపెట్టేసింది. దీనికి తోడు, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఎల్ నినో విస్తారంగా వర్షాలు కురవడానికి అవసరమైన వాతావరణాన్ని మరింత బలహీనపరిచింది. ఎల్ నినో ఒక్కటే రుతుపవనాలను పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ, పిడుగులతో కూడిన వర్షాలు పడకుండా వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చగలదు. వీటన్నిటికీ తోడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల వర్షపాతాన్ని నడిపించే ‘మ్యాడెన్-జూలియన్ ఆసిలేషన్’ (MJO) తరంగాలు కూడా జూన్ మొదటి పక్షం రోజుల్లో అసలు సహకరించలేదు. ఇది తీవ్ర ప్రతికూల దశలో ఉండటం వల్ల హిందూ మహాసముద్రంపై మేఘాల ఆవిర్భావానికి ఎలాంటి మద్దతు దక్కలేదు. మధ్యలో పశ్చిమ తీరం వెంబడి కొద్దిపాటి రుతుపవన కదలికలు కనిపించి వర్షాలు పడినప్పటికీ, అది తాత్కాలికంగానే మిగిలిపోయింది. రుతుపవన ప్రవాహాన్ని పట్టి ఉంచేందుకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం లేకపోవడం, పొడి గాలులు పదే పదే పలకరించడంతో ఆ వేడి కాస్తా తగ్గి రుతుపవనాలు మళ్లీ దక్షిణానికి వెనకడుగు వేశాయి.
అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నాల్గవ వారంలో పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా MJO తరంగాలు అనుకూల దశలోకి ప్రవేశిస్తుండటంతో పాటు.. ‘లో లెవెల్ జెట్’, భూమధ్యరేఖను దాటి వచ్చే గాలులు (క్రాస్-ఈక్వటోరియల్ ఫ్లో), ఎగువ స్థాయి తూర్పు గాలులు మరింత బలోపేతం కానున్నాయి. ఈ సానుకూల వాతావరణ మార్పులన్నీ కలిసి.. దేశంలో పదే పదే చొరబడుతున్న పొడి గాలుల ప్రభావాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి, భారతదేశంలో రుతుపవనాలు మళ్లీ గాడిన పడేలా, నిజమైన వర్ష పాతాన్ని మోసుకొచ్చేలా పునరుజ్జీవనం ఇస్తాయని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.

