World Health Organization: బర్డ్ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో హస్పటల్ లో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24వ తేదీన మరణించినట్లు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. పౌల్ట్రీ, జంతువుల వద్దకు బాధితుడు వెళ్లిన ఆధారాలు కూడా లేవని చెప్పింది. అయితే, ఆయనకు ఫస్ట్ నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Read Also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
కాగా, ఏవియన్ ఫ్లూ లక్షణాలు బయటపడడానికి ముందే బాధితుడు మూడు వారాల నుంచి అనారోగ్యం పాలైనట్లు అధికారులు తెలిపారు. అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా గుర్తించలేకపోయారు. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. అయితే అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొనింది. మరోవైపు బర్డ్ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్5ఎన్1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ పని చేస్తున్న కొంత మందికి ఇది సోకినట్లు నిర్ధరించుకున్నారు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధరణ చేయలేదు.
అయితే, ఇటీవల భారతదేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అలర్ట్ గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశు సంవర్థక విభాగంతో పంచుకోవాలని పేర్కొనింది. దీని వల్ల ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
