Site icon NTV Telugu

China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో

Tedros Adhanom Ghebreyesus

Tedros Adhanom Ghebreyesus

China Corona: చైనాలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడిలించిన తర్వాత వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో చైనాలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనాలో ఎదరవుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్‌ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని ప్రకటించారు. కాగా, చైనాలో కరోనా కేసుల తీవ్రత అధికమైన నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

Read Also: Bike Romance: రన్నింగ్ బండిపై రొమాన్స్.. రాచ మర్యాదలు చేసిన పోలీసులు

చైనా నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు పలు మార్గదర్శకాలను జారీ చేశాయి. దాదాపు అక్కడి ప్రయాణికులు రాకుండా నిరోధిస్తున్నాయి. వచ్చినా వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులను చేసుకున్న తర్వాతే దేశంలోకి అడుగు పెట్టనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ దీనిపై కూడా స్పందించారు. చైనాలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదు గురించి సరైన సమాచారం లేదన్నారు. అయినప్పటికీ పలు దేశాలు ముందు జాగ్రత్తగా పలు చర్యలు చేపడుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్‌ వల్ల భవిష్యత్తులో సంభవించే మహమ్మారిలను అర్థం చేసుకోవడం, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందన్నారు.

Exit mobile version