తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీకు ఎన్నికలు ముగిశాయి. అయితే, అందరి చూపు మాత్రం బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తుందా.? లేక బీజేపీ దీదీ కంచుకోటల్ని బద్దలుకోడుతుందా? అని అంతా మాట్లాడుకుంటుున్నారు. అయితే, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ సునామీ ఈ సారి బెంగాల్లో కనిపిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఒకటి రెండు మినహా అన్ని ప్రముఖ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు.
భవానీపూర్లో ఉరుకులు పరుగులు
ఇదిలా ఉంటే, ఎప్పుడూ లేని విధంగా మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో హైరానా పడుతున్నారు. రెండో దశలో జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ఆమె బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ కీలక నేత, 2021లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఆమెపై పోటీకి నిలుచున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల రోజు పార్టీ కార్యలయం నుంచి పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంటారు. కానీ, మమతా బెనర్జీ మాత్రం భవానీపూర్లో పలు పోలింగ్ కేంద్రాలకు ఉరుకులు పరుగులు పెట్టింది. కేంద్రం, కేంద్ర బలగాలపై విమర్శలు గుప్పించింది. గతంలో మూడుసార్లు గెలిచిన దీదీ ఇలా ఎప్పుడూ కంగారు పడటం చూడలేదు.
ఈవీఎంలపై కన్నేయాలని సూచన
ఇక ఎన్నికలు ముగిసిన ఒక రోజు తర్వాత ఎగ్జిట్ పోల్స్పై ఆమె మండిపడుతూ 9 నిమిషాల వీడియో ఎక్స్లో పోస్ట్ చేసింది. తాము 220కి పైగా స్థానాల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఈవీఎంలపై నిఘా వేయాలని తన పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించింది. బీజేపీ, కేంద్ర బలగాలు ఫలితాన్ని మార్చాలని చూస్తున్నాయని మండిపడింది. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నాయని ఆరోపించారు. అయితే, ప్రతీ సందర్భంలో ఆమె బాడీ లాంగ్వేజ్ లో ఒక నిరాశ కనిపిస్తోంది.
అర్ధరాత్రి హై డ్రామా
ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం కోల్కతాలో ఒక ఈవీఎం సెంటర్ వద్ద టీఎంసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని టీఎంసీ ఆరోపించారు. దీంతో, సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి గంటల తరబడి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆఖరి రాగం పాడేసినట్లేనా
మమతా బెనర్జీ గతంలో మూడు సార్లు కూడా ఇదే ఈవీఎంలతో గెలించింది. కానీ ఇప్పుడు ఈవీఎంలు, కేంద్ర ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మమతా ఆఖరి రాగం పాడేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలు ఎక్కడో తేడా కొడుతున్నా్యి కాబట్టే, దీదీ ఇలాంటి పనులు చేస్తోందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిజమైన ఫలితాలు తెలియాలంటే మే 4 వరకు ఓపిక పట్టాల్సిందే.
