తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల రాహుల్ గాంధీ అనూహ్యమైన విజయాన్ని సాధించారు. విక్టరీనే కాదు.. భారీ మెజార్టీ కూడా సాధించారు. దీంతో ఆయన గురించి తాజాగా చర్చ సాగుతోంది. కంచుకోట రాయ్బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు వదులుకుంటారని చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో కూడా రాహుల్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అప్పుడు అమేథీలో ఓడిపోయి.. వయనాడ్లో గెలుపొందారు. ఈ సారి కూడా అలాగే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సాగింది. అమేథీలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్.శర్మకు ఇచ్చారు. అనూహ్యంగా శర్మ ఇక్కడ భారీ విక్టరీ సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో వయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేశారు. ఈ రెండు చోట్ల కూడా రాహుల్ గెలుపొందారు. అంతేకాదు భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఏదో ఒక సీటు వదులుకోవల్సి ఉంటుంది. కంచుకోటను వదులుకుంటారా? లేదంటే ఆపన్నహస్తం అందించిన వయనాడ్ను వదులుకుంటారా? అన్నది చర్చ సాగుతోంది.
అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కంచుకోట రాయ్బరేలీ నుంచి ప్రియాంకాగాంధీని దించాలని భావిస్తున్నారు. ప్రియాంక ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు మంచి అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ సీటు సోనియాగాంధీది. అయితే ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆ స్థానంలో ప్రియాంకను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఇక రాహుల్.. రాయ్బరేలీలో 3 లక్షల ఓట్లకు పైగా.. వయనాడ్లో రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచే రాహుల్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
