వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఆంకోనిగూడెం గ్రామంలోని అశోక్ నగర్లో అరుదైన పాము జనాల కంట పడింది. దాంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నలుపు, పసుపు రంగు చారలతో కనిపించిన ఈ పామును చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును పరిశీలించారు. పాము ఆకారం, శరీరంపై ఉన్న నలుపు–పసుపు చారలను పరిశీలించిన అధికారులు.. బాండెడ్ క్రైట్ (కట్టువిరియన్)గా గుర్తించారు. పాము సుమారు ఐదు అడుగుల పొడవు ఉన్నట్లు తెలిపారు.
బాండెడ్ క్రైట్ విషపూరితమైన పాము అని అటవీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఈ జాతి పాములు మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయని, రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తాయని తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని పాములు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దానిని చంపేందుకు లేదా పట్టుకునేందుకు ప్రయత్నించకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.
సాధారణంగా కనిపించే ప్రాంతానికి భిన్నంగా అశోక్ నగర్లో బాండెడ్ క్రైట్ దర్శనమివ్వడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అటవీ సిబ్బంది పామును సురక్షితంగా పట్టుకుని, అనంతరం పాకాల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు, పాములు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అశోక్ నగర్ ప్రాంతంలో ఈ అరుదైన పాము కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

