భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు వహించనున్నారు.
బిజీ షెడ్యూల్ వల్లే ఈ నిర్ణయం..
భారత జట్టు రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్లతో బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన కొద్ది రోజులకే జూలై 23 నుంచి జింబాబ్వే పర్యటన ప్రారంభం కానుంది. గంభీర్కు విశ్రాంతినిస్తూ, పనిభారాన్ని తగ్గించేందుకు గానూ ఈ పర్యటన బాధ్యతలను లక్ష్మణ్కు అప్పగించారు.
జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 లో కూడా భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తారు. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు సిరీస్లు ఒకేసారి జరగడం వల్ల గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి వెస్టిండీస్ సిరీస్లో ఉంటారు, లక్ష్మణ్ ఏషియన్ గేమ్స్ జట్టును నడిపిస్తారు.
VVS Laxman to Head Coach team India for the Zimbabwe tour and Asian Games. (Gaurav Gupta). pic.twitter.com/YfGkHh0Ngt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
సపోర్ట్ స్టాఫ్లో మరికొంతమంది..
వీవీఎస్ లక్ష్మణ్తో పాటు సపోర్ట్ స్టాఫ్లో మరో ఇద్దరు మాజీ భారత ఆటగాళ్లకు చోటు లభించింది. మాజీ క్రికెటర్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా, మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ కోచింగ్ త్రయం జింబాబ్వే సిరీస్, ఏషియన్ గేమ్స్ తర్వాత బంగ్లాదేశ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి పెద్ద టోర్నీలను గెలిచినప్పటికీ, ఇటీవల ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన పరాజయాల నేపథ్యంలో రాబోయే సిరీస్లు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారాయి.

