Site icon NTV Telugu

AP Tourism: పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు.. 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం..

Ap Tourism

Ap Tourism

2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు.

Also Read:Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..

రిజువేనేట్ ఇన్ బౌండ్@2030 అనే అంశంపై జరిగిన మూడు రోజుల ఈవెంట్ లో అజయ్ జైన్ ప్రసంగించారు…రాష్ట్ర పర్యాటకానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను, ఏపీ పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదా తదితర అంశాలను వివరించారు. పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్ ఉందని అజయ్ జైన్ వెల్లడించారు. పర్యాటకాభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల పాత్రను వివరిస్తూ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి, పర్యాటకులకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మౌలిక సౌకర్యాల కల్పనలో, పర్యాటక ప్రాంతాలకు రాకపోకల విషయంలో కనెక్టివిటీ అంశంలో ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

Also Read:Heavy Rains : ఉత్తరాదిలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

ఈ క్రమంలో ఏపీలో నిర్మించ తలపెట్టిన కొత్త ఎయిర్ పోర్టుల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఏపీ పర్యాటకాభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది విశాఖలో జరిగే ఐఏటీఓ సదస్సుకు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలికారు. ఈవెంట్ లో భాగంగా వ్యాపార సెషన్ లు, ఇండియన్ టూరిజం ఫెయిర్ తదితర అంశాలపై చర్చ జరిగింది.

Exit mobile version