Visakhapatnam-Araku Vistadome Train Journey: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలో విశాఖపట్నం-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ రైలు మార్గంగా ఎంపికైంది. “ఇండియన్ రూట్స్” ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో ఈ రూట్కు అగ్రస్థానం దక్కడం రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపును అందించేలా ఉంది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డులను జూన్ 15న గోవాలో నిర్వహించనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అవార్డును స్వీకరించాల్సిందిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు ఇండియా టుడే సంస్థ అధికారిక ఆహ్వానం పంపింది. జాతీయ స్థాయి అవార్డు రావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. గోవా వేదికగా జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ గుర్తింపు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తూర్పు కనుమల అద్భుత ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, గుహలు, పచ్చని లోయలు, జలపాతాల అందాల మధ్య సాగే విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేకతల కారణంగానే జాతీయ స్థాయిలో ఈ రూట్కు అత్యున్నత గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడించింది. అలాగే గోవాలో జరిగే టూరిజం సమ్మిట్లో దేశంలోని పర్యాటక రంగ అభివృద్ధి, కొత్త అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై జరిగే కీలక చర్చల్లో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. ఈ అవార్డు ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి, పర్యాటక రంగాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

