Virat Kohli: మైదానంలో అతడి కాళ్లు మొక్కిన కోహ్లీ.. వీడియో వైరల్!

  • ఐపీఎల్‌ 2025లో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన
  • ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 443 రన్స్
  • ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 రన్స్
  • ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే
Virat Kohli, Rajkumar Sharma

Virat Kohli, Rajkumar Sharma

ఐపీఎల్‌ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 443 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విరాట్.. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిలకడగా ఆడాడు. ఆర్సీబీ ఛేదనలో ఇబ్బందిపడుతున్న సమయంలో 47 బంతుల్లో 51 రన్స్ చేసి విజయానికి బాటలు వేశాడు. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ మ్యాచ్ అనంతరం మైదానంలో తన చిన్ననాటి కోచ్ ఆశీర్వాదం తీసుకున్నాడు.

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డీసీ, ఆర్సీబీ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన రాజ్‌కుమార్.. కోహ్లీని కలిశారు. కోచ్ రాకను గమనించిన విరాట్.. అతని కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆపై కోహ్లీని హగ్ చేసుకున్న ఆయన.. ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోచ్ పట్ల మర్యాద, గౌరవం చూపిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే’, ‘కోహ్లీ చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి’, ‘విరాట్ నిరాడంబరతకి ఇదే నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!

కోచ్ రాజ్‌కుమార్ శర్మ కాళ్లను విరాట్ కోహ్లీ మొక్కడం ఇదే మొదటి కాదు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడినప్పుడు కూడా కోహ్లీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఢిల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడే ప్రతిసారీ మైదానం మొత్తం నిండిపోతుంది. 2023లో కోహ్లీ ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, 13 సంవత్సరాల తర్వాత ఢిల్లీ తరపున రైల్వేస్‌తో రంజీ మ్యాచ్ ఆడినప్పుడు, ఆదివారం ఆర్సీబీ తరఫున ఆడినా అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. విరాట్ ఆర్సీబీకి ఆడుతున్నా తమ సూపర్‌స్టార్‌ను చూడడానికి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, సోనిపట్ నుంచి ఫాన్స్ భారీగా హాజరయ్యారు.