టీమిండియా దిగ్గజ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం.
వన్డే చరిత్రలో లక్ష ఛేదనలో (వన్డేల్లో ఛేజింగ్) విరాట్ కోహ్లీ 6,000 పరుగులు పూర్తి చేశాడు. ఛేదనలో 6 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 102 ఇన్నింగ్స్లలో 89.29 సగటుతో 6,072 పరుగులు సాధించి.. లెజెండరీ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 232 ఇన్నింగ్స్లలో 69 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ 161 ఇన్నింగ్స్లలో 70 సార్లు 50+ పరుగులు చేశాడు. 153 ఇన్నింగ్స్లలో 55 సార్లు ఈ ఘనత సాధించిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. సిడ్నీ హాఫ్ సెంచరీతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరని అధిగమించి.. కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో లెజెండ్ సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 463 మ్యాచ్ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. విరాట్ 305 మ్యాచ్ల్లో 57.69 సగటుతో 14,250 పరుగులు చేశాడు. సంగక్కర 404 మ్యాచ్ల్లో 14,234 పరుగులు చేశాడు.
