Vijaysai Reddy About New Party: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రావణమాసం పూర్తయిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పార్టీపై మాజీ ఎంపీ చేసిన తాజా ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తి నెలకొంది.
కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ కేంద్రంగా కొనసాగిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. త్వరలో విజయవాడలో నిర్వహించనున్న సమావేశంలో పార్టీ పేరు, విధివిధానాలు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయవాడ సమావేశం అనంతరం తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా తమ కొత్త పార్టీ పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం తమ పార్టీ ప్రధాన అజెండాగా ఉంటాయని చెప్పారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేసే రాజకీయ వేదికను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల వారీగా ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం పార్టీ నిర్మాణం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

