Vijay Sai Reddy: ఎప్పటి నుంచి కొత్త పార్టీ ప్రకటిస్తాను అని చెబుతున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ రోజు ఆసక్తికర ప్రకటన చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ వేదికకు శ్రీకారం చుడుతున్నట్లు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరముందని పేర్కొన్న ఆయన.. త్వరలోనే కొత్త పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తానన్నారు. ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ పార్టీని నిర్మించనున్నట్లు తెలిపారు. విజయవాడలో పార్టీ ఏర్పాటుపై ఆయన చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేనతో పాటు సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ఉన్నప్పటికీ.. వాటిలో తగిన పోరాట పటిమ కనిపించడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని, ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వాటి మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో ప్రజలు నలిగిపోతున్నారని విమర్శించారు. అయితే, టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలుగా మారాయని, రెండు పార్టీల అజెండా ఒకటేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రజలకు గోరంత చేసి తమకు కొండంత ప్రయోజనం పొందడమే వాటి ధ్యేయంగా మారిందన్నారు. పొలాల్లో, నదుల్లో ఇసుక తీసుకోవడం నుంచి రిజిస్ట్రేషన్, ఎన్ఓసీ, వ్యాపార కార్యకలాపాల వరకు రౌడీ మామూళ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎంపీ నుంచి కౌన్సిలర్ వరకు ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల పని మద్యం దుకాణాలు, సెటిల్మెంట్లకే పరిమితమైందని సాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టడంతో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని అన్నారు. అధికార పార్టీ తమిళనాడు తరహా రాజకీయాలను రాష్ట్రంలో ప్రారంభించిందని, ప్రత్యర్థి పార్టీలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెండు ప్రధాన పార్టీల రాజకీయాలు రక్తపాతం సృష్టించే విధంగా ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణపై తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీకి సీఎం అభ్యర్థిని కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బాల్థాకరే తరహాలో మెంటార్ పాత్రలో ఉంటానని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడిపించడంలో మార్గనిర్దేశం చేస్తానని, అయితే ముఖ్యమంత్రి పదవిని ఆశించబోనన్నారు. తన కుటుంబ సభ్యుల జోక్యం కూడా పార్టీలో ఉండదని స్పష్టం చేశారు.
కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నుంచే ముఖ్యమంత్రులు కావాలా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బీసీలు, కాపులు, వెలమలు తదితర అనేక సామాజిక వర్గాల్లో సీఎం అయ్యే సామర్థ్యం ఉన్న వారు లేరా అని ప్రశ్నించారు. సామర్థ్యం ఉన్న నాయకులను అణగదొక్కి రెండు వర్గాలకే సీఎం పదవి పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సామర్థ్యం ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందన్నారు. తాను నమ్మే వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నానని, కొత్త పార్టీలో తాను మెంటార్గా మాత్రమే వ్యవహరిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించేందుకు పార్టీని నిర్మిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, గత రెండేళ్లుగా తాను ఒక పుస్తకంపై పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉద్భవించింది, ఆ తర్వాత దాని పరిణామాలు ఎలా కొనసాగాయనే అంశాలపై సుమారు 350 పేజీల పుస్తకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఈ పుస్తకాన్ని ఎలాంటి కులాభిమానంతో రాయలేదని, ఆసక్తితో అధ్యయనం చేసి రూపొందించానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

