గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న తమ వివాహ బంధం గురించి అధికారికంగా స్పందించారు. అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమే ఈ నిర్ణయానికి కారణమని వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆదివారం రాత్రి విజయ్, రష్మిక కలిసి ఒక జాయింట్ పోస్ట్ను షేర్ చేశారు.. ‘మేము మా కోసం ఏదైనా ఎంచుకోవాలనుకునేలోపే అభిమానులే ఆ పని పూర్తి చేస్తున్నారు. మా పెళ్లి విషయంలోనూ అభిమానులు ఎంతో ప్రేమతో పెట్టిన ‘విరోష్’ (ViRash) అనే పేరునే మా వెడ్డింగ్ కి పెట్టాలని నిర్ణయించాం’ అని వారు పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్ ప్రకారం రాజస్థాన్లోని ఉదయ్పుర్లో ఈ నెల 26న (ఫిబ్రవరి 26) అత్యంత వైభవంగా వీరి వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్లోని అభిమానుల కోసం, సినీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ను నిర్వహించబోతున్నారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఏడడుగులు వేయబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమను ఇంతలా ఆదరిస్తున్నందుకు అభిమానులకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
