వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. మెజిస్ట్రేట్ ఆదేశాలకే జగ్గయ్యపేట సబ్ జైల్ అధికారులు ఓకే చెప్పారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు వర్రా రవీందర్ రెడ్డిని తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రాని.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో వర్రాపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు వర్రాపై ఐటీ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. చిల్లకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లి వర్రాను అదుపులోకి తీసుకున్నారు. కడప జైలు అధికారులు వర్రాకు వైద్య పరీక్షలు చేయించి.. జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారు. బుధవారం జగ్గయ్యపేట కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
