15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత దేశవాళీ క్రికెట్లో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాడు. బెంగళూరులో సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఈ యువ బ్యాటర్ ఈస్ట్ జోన్ జట్టు బాధ్యతలను స్వీకరించి, అతిపిన్న వయసులోనే జట్టును నడిపిన కెప్టెన్గా నిలిచాడు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడంపై దేశవాళీ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ యువ ఆటగాడిని సుదీర్ఘకాలంలో గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈస్ట్ జోన్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. అయితే.. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ సమయంలో సెంట్రల్ జోన్ మొదటి ఇన్నింగ్స్ 19వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ వికెట్ కీపర్, కెప్టెన్ ఇషాన్ కిషన్ అనూహ్యంగా గాయపడ్డాడు. వికెట్ కీపింగ్ చేస్తూ కుడి మణికట్టుకు తీవ్రమైన దెబ్బ తగలడంతో మైదానంలోనే ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పితో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥
– Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD
— Johns. (@CricCrazyJohns) August 30, 2026
ఇషాన్ కిషన్ స్థానంలో కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించగా, కెప్టెన్సీ వైభవ్ సూర్యవంశీకి చేరింది. కేవలం 15 ఏళ్ల వయసులో, కెరీర్లో పదో ఫస్ట్-క్లాస్ , రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఈ యంగ్ క్రికెటర్.. మహమ్మద్ షమీ, ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఎంతోమంది సీనియర్ అంతర్జాతీయ, దేశవాళీ ఆటగాళ్లు ఉన్న జట్టును నడిపించడం విశేషం. అతిపిన్న వయస్కుడైనప్పటికీ, అనుభవజ్ఞులైన బౌలర్లను నడిపిస్తూ సెంట్రల్ జోన్ను లంచ్ సమయానికి 81 పరుగులకే 3 వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టడంలో తన నాయకత్వ పటిమను చాటుకున్నాడు. ఇషాన్ కిషన్ మైదానంలోకి త్వరగా తిరిగి వచ్చినా రాకపోయినా, ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రయాణంలో మరొక ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలిచిపోతుంది.

