Vaibhav Sooryavanshi Records: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన ఆటతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యాటర్కు ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. జూన్ 26న జరిగే తొలి మ్యాచ్లో అతడికి తుది జట్టులో ఒకవేళ అవకాశం లభిస్తే.. భారత క్రికెట్ చరిత్రలోని పలు అరుదైన రికార్డులను బద్దలు కొట్టే అవకాశం లభించబోతుంది. మరి అవేంటో ఒక లుక్ వేద్దామా..
సచిన్ రికార్డుపై కన్ను:
భారత్ తరఫున పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు నమోదైంది. సచిన్ 1989లో పాకిస్థాన్పై 16 సంవత్సరాల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఐర్లాండ్పై వైభవ్ సూర్యవంశీకి టీ20 క్యాప్ లభిస్తే.. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
రోహిత్ శర్మ రికార్డుకు చెక్:
ఐర్లాండ్లో టీ20ల్లో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రోహిత్ శర్మ పేరు ఉంది. రోహిత్ అక్కడ 97 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి 98 పరుగులు చేయగలిగితే.. ఐర్లాండ్లో అత్యధిక పరుగులు చేసిన భారత టీ20 ఓపెనర్గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.
అత్యధిక పరుగుల రికార్డు:
భారత్ తరఫున తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అజింక్య రహానే రికార్డు సొంతం చేసుకున్నాడు. 2011లో ఇంగ్లాండ్పై జరిగిన తన అరంగేట్ర మ్యాచ్లో రహానే 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్లో 62 పరుగులు సాధిస్తే.. రహానే రికార్డు చరిత్రలో కలిసిపోతుంది.
అత్యధిక సిక్సర్ల రికార్డు:
భారత్ తరఫున తొలి టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ పేరిట రికార్డు ఉంది. ఇంగ్లాండ్పై తన తొలి టీ20 మ్యాచ్లో ఇషాన్ నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసే వైభవ్ తన తొలి మ్యాచ్ లో 5 సిక్సర్లు కొడితే, ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు.
ఐర్లాండ్ గడ్డపై ప్రత్యేక అవకాశం:
ఇప్పటివరకు ఐర్లాండ్లో భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్ ఉన్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. వీరిలో ఏ ఒక్కరూ తమ తొలి మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవలేకపోయారు. వైభవ్ అరంగేట్ర మ్యాచ్ లో కనీసం ఒక పరుగు చేసినా.. ఐర్లాండ్ గడ్డపై పరుగులు సాధించిన తొలి భారత డెబ్యూ ఆటగాడిగా నిలుస్తాడు.

