Bhuvneshwar Kumar: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. 15 ఏళ్ల కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ చూసి అనుభవజ్ఞుడైన బౌలర్లు షాక్ అవుతున్నారు. ఇక స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. ఈ విధ్వంసరకర బ్యాట్స్మెన్ గురించి మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మాట్లాడాడు. టీ20లో వయసుతో సంబంధం లేదని భువీ అన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సహజమే అని చెప్పుకొచ్చాడు. ఈ కుర్రాడు చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. తన బౌలింగ్లో ఓ 15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని తాము బాధపడటం లేదన్నాడు.
READ MORE: Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
తాము వేసిన ప్లాన్స్ను సరిగ్గా అమలు చేయలేకపోయామని భువీ ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్లో ఒక క్యాచ్ మిస్ అయ్యిందని గుర్తు చేశాడు. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ కొనియాడాడు. ఆర్సీబీ బౌలింగ్ వ్యూహాల గురించి వివరణ ఇచ్చాడు. పవర్ప్లేలో స్పిన్నర్లను వాడటం కష్టమని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల సుయాష్ను తీసుకోలేకపోయామని చెప్పాడు. కేవలం ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాత్రమే ఉండటంతో వైభవ్ను కట్టడి చేయడం సాధ్యం కాలేదని భువీ అంగీకరించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి గురించి భువీ మాట్లాడుతూ.. “అతను కేవలం బంతిని బలంగా బాదడమే (Slogging) కాకుండా, సరైన క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. ఆ వయసులో అంత మెచ్యూరిటీ ఉండటం గొప్ప విషయం” అని కొనియాడాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 201 పరుగుల భారీ స్కోరును అందించాడు. విరాట్ కోహ్లీ (32), రోమారియో షెపర్డ్ (22), వెంకటేష్ అయ్యర్ (29) కూడా తమ వంతు సహకారం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
