US Iran Conflict: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగా అవి ముందుకు సాగలేకపోయాయని సమాచారం. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నంగా భావించిన ఈ సదస్సు ఫలితం ఇవ్వకపోవడం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!
ఈ చర్చలు విఫలం కావడానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు ఇవే..
1. అణు వ్యూహంపై వీడని మొండితనం
చర్చల బల్లపై ఇరు దేశాలు తమ పాత వైఖరికే మొగ్గు చూపాయి. ఇరాన్ తన యురేనియం సుసంపన్నం చేసే కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ షరతులకు లొంగడం లేదని విమర్శించగా, ఇరాన్ మాత్రం అమెరికా ప్రతిపాదనలను “అన్యాయమైనవి”గా కొట్టిపారేసింది.
2. ట్రంప్ దూకుడు.. చర్చలపై ఒత్తిడి
శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం ఉండాల్సింది పోయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు చర్చలను దెబ్బతీశాయి. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై భారీ దాడులు తప్పవని ఆయన హెచ్చరించడం, ఇది దౌత్యం కంటే తమను లొంగదీసుకునే వ్యూహంగా ఇరాన్ భావించింది. ఈ బెదిరింపులు ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచాయి.
3. ఇజ్రాయెల్ దాడులు – సమీకరణాలు మార్చిన లెబనాన్
ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతుండగానే, ఇరాన్ మిత్రపక్షమైన హెజ్బుల్లా (లెబనాన్) స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ఈ దాడులను ఆపాలని ఇరాన్ కోరినప్పటికీ, అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ తమకు వర్తించదని నెతన్యాహు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామం చర్చల్లో రాజీ పడే అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది.
4. హోర్ముజ్ జలసంధిపై ప్రతిష్టంభన
ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆంక్షలు ఎత్తివేస్తేనే జలసంధిని తెరుస్తామని ఇరాన్ పట్టుబట్టగా, ముందస్తు షరతులు లేకుండా చమురు సరఫరాను పునరుద్ధరించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యూహాత్మక జలమార్గంపై పట్టు కోసం ఇరు దేశాలు పట్టుదలకు పోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
5. దశాబ్దాల అవిశ్వాసం
అంతిమంగా అమెరికా-ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న పరస్పర అపనమ్మకమే ఈ విఫలానికి మూలకారణం. “మాకు సద్భావన ఉంది కానీ నమ్మకం లేదు” అని ఇరాన్ నేతలు స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా ప్రతిపాదనలను ఒక “ఉచ్చు”గా ఇరాన్ భావించగా, ఇరాన్ కాలయాపన చేస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
READ ALSO: Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!
