US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని తాము “ఆత్మరక్షణ దాడులు” (సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్) నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఇరానియన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి, తమ బలగాలను రక్షించుకోవడానికే ఈ రోజు దక్షిణ ఇరాన్లో ఆత్మరక్షణ దాడులు చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఫాక్స్ న్యూస్కు అధికారికంగా ప్రకటించారు. యుద్ధ నౌకలు, విమానాల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ జలసంధిలో మైన్లు (సముద్రపు బాంబులు) అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ పడవలను, అలాగే క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూనే, ఎంతో సంయమనంతో తమ బలగాల రక్షణ కోసం సెంట్రల్ కమాండ్ ఈ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే..?
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన రెండు పడవలు మైన్లు అమర్చుతుండటాన్ని అమెరికా రక్షణ దళాలు గుర్తించాయి. ఇదే సమయంలో అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ లోని బందర్ అబ్బాస్ వద్ద ఉన్న ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రం (SAM site) దాడికి దిగింది. దీంతో తక్షణమే స్పందించిన అమెరికా దళాలు ఆ క్షిపణి కేంద్రాన్ని మట్టుబెట్టాయి. ఈ రక్షణ దాడుల్లో ఇరాన్కు చెందిన ఆ రెండు నౌకలతో పాటు, క్షిపణి కేంద్రం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని అమెరికా అధికారి ధృవీకరించారు. అయితే, ఈ దాడుల వల్ల ఇరాన్తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి ముప్పు రాలేదని, ఎందుకంటే ఈ ఆపరేషన్ చాలా పరిమిత పరిధిలోనే జరిగిందని ఫాక్స్ న్యూస్కు చెందిన మరో ఇద్దరు ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ దాడుల పర్వం ముగిసిందని సదరు ఉన్నతాధికారి తేల్చి చెప్పారు.
ఇక, ఈ దాడుల నేపథ్యంలో సోమవారం హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ తీరప్రాంత నగరాలైన బందర్ అబ్బాస్లో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించగా, సిరిక్, జాస్క్ ప్రాంతాల సమీపంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఉద్రిక్తతలు ఇలా ఉంటే, రాజకీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేయడం కోసం అమెరికాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరాన్ను కూడా భాగస్వామిని చేస్తూ పశ్చిమాసియాలో ఒక శాంతి ఒప్పందాన్ని విస్తరించడానికి ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం.
