Medak: ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గాలివానలు బీభత్సం సృష్టించాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట్లో 3.2 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డ్ల్లో ధాన్యం తడిసి ముద్దవగా, వర్షంలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలుల ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. వర్షం కారణంగా వరి ధాన్యం కూడా తడిసిపోయింది. అదేవిధంగా అల్లాదుర్గంలో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిశాయి. ఇక సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఇండ్ల మధ్య భారీ వృక్షం కూలిపోగా, వట్పల్లిలో వర్షపు నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద, పాత భవనాల వద్ద లేదా హోర్డింగ్ల కింద నిలబడవద్దని అధికారులు జనాలకు సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని.. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
