NTV Telugu Site icon

Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

Vande Bharat

Vande Bharat

Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందే భారత్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. విశాఖ జంక్షన్‌లో ఉత్తరాది రాష్టాలకు తొలి సెమీ హైస్పీడ్ రైలుగా ఈ వందేభారత్‌ రైలు నిలిచింది. ఏపీ,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ వందే భారత్ రైలు ప్రయాణించనుంది. దీంతో విశాఖ నుంచి వందే భారత్ నెట్‌వర్క్ నాలుగుకు పెరిగింది. ప్రస్తుతంవిశాఖ-,సికింద్రాబాద్ మధ్య 2, విశాఖ-భువనేశ్వర్ మధ్య ఒక వందేభారత్‌ రైళ్ల రాకపోకలు నడుస్తున్నాయి.

Read Also: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద H బ్లాక్‌ ఆపరేషన్ ప్రారంభం

రాయ్‌పూర్‌-విజయనగరం మార్గంలో ఇది మొదటిది కావడం గమనార్హం. విశాఖ-దుర్గ్ వందేభారత్.. దుర్గ్‌ నుంటి వారానికి 6 రోజులు ఉదయం 5.45 గంటలకు బయలు దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-దుర్గ్ వందేభారత్ విశాఖ నుంచి వారానికి 6 రోజులు 02.50 గంటలకు బయలుదేరి.. అదేరోజు రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమిపూజ జరగనుందని తెలిపారు. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలకు సాకారం లభించిందన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ళను నడిపి ప్రపంచానికి మేకిన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. ప్రస్తుతం రైల్వేలు, పౌర విమానయాన సంస్థలు పోటీపడి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.