Thiruvananthapuram: కేరళలోని త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి బ్రిటన్కు చెందిన అత్యాధునిక F-35B లైట్నింగ్ II యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం సంచలనంగా మారింది. ఇండియన్ ఓషన్పై మిషన్ లో ఉండగా, విమానం ఇంధనం తక్కువ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ F-35B యుద్ధ విమానం బ్రిటన్కు చెందిన HMS Prince of Wales క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఈ వాహక నౌకా సమూహం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లలో పాల్గొంటోంది. ఇటీవలే భారత నౌకాదళంతో సంయుక్త సముద్ర విన్యాసాలు పూర్తి చేసిన ఈ దళం, భారత సముద్ర ప్రాంతంలో టూరింగ్ చేస్తోంది.
Read Also: Ahmedabad plane crash: బోయింగ్ 787 నిర్వహణలో తమ ప్రమేయం లేదు.. టర్కీ స్పష్టికరణ..!
F-35B మోడల్ ప్రత్యేకంగా షార్ట్ టేక్-ఆఫ్, వెర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యంతో రూపొందించబడింది. ఇవి క్యాటపుల్ట్ లేని వాహక నౌకల మీద కూడా ల్యాండ్ కావచ్చు. అయినా సరే, ఈ ఘటనలో విమానం ఎందుకు HMS Prince of Walesపై ల్యాండ్ చేయలేకపోయిందనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం ప్రకారం, వాహక నౌక వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అక్కడ ల్యాండింగ్ సాధ్యపడకపోయి ఉండవచ్చని అంటున్నారు.
F-35 ప్రోగ్రామ్ను అమెరికాకు చెందిన డిఫెన్స్ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ మల్టీ-రోల్ యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. స్టెల్త్ లక్షణాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, డేటా షేరింగ్ వ్యవస్థ వంటి అధునాతన సాంకేతికతలతో ఇది US, UK, ఇజ్రాయెల్, NATO దేశాల వాయుసేనలకు ప్రధానంగా ఉపయోగపడుతోంది. తాజా సమాచారం ప్రకారం విమానాన్ని భద్రంగా త్రివేంద్రం విమానాశ్రయ పరిధిలో పార్క్ చేశారు. ఏ ప్రాణనష్టం లేకుండా ఈ ఘటన ముగియడంతో రక్షణ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై బ్రిటన్, భారత రక్షణశాఖలు సమగ్ర సమాచారం సేకరిస్తున్నాయి.