Udhayanidhi Stalin Arrest: నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Udhayanidhi

Udhayanidhi

Udhayanidhi Stalin Arrest: తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీలో కావేరీ నీటి వివాదంపై ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేస్తూ ఉదయనిధి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ అంశంలో ప్రతిపక్ష నేతలపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే చెన్నైలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసుల బృందం ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, అరెస్టు భయంతో ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.

కావేరీ నీటి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి విమర్శలు గుప్పిస్తుండగా, సభలోని కొందరు వ్యక్తులు “త్రిష, త్రిష” అని నినాదాలు చేశారు. ఆ సమయంలో కొద్దిసేపు ప్రసంగాన్ని నిలిపివేసిన ఉదయనిధి.. డబుల్ మీనింగ్, అసభ్యకరంగా మాట్లాడారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయ్‌తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి.

ఈ వ్యవహారంపై అధికార టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. టీవీకే నేత ఆథవ్ అర్జున ఉదయనిధిని అసభ్య నిధిగా అభివర్ణిస్తూ, అన్నాదొరై నిర్మించిన ఆదర్శవంతమైన ఉద్యమాన్ని తన డబుల్ మీనింగ్ ప్రసంగాలతో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై ఉన్న వికృత ఆలోచనలను ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం సిగ్గుచేటని, తమిళనాడులోని ఏ తల్లీ, సోదరీ ఈ తరహా భాషను అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఇక టీవీకే ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ స్పందిస్తూ, సొంత కూతురు, కొడుకు ముందే ఉదయనిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని ప్రశ్నించారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించింది. టీఎన్ బీజేపీ ముఖ్య ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవిగా, వికృతంగా అభివర్ణిస్తూ ఉదయనిధిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నటి త్రిషకు ఉదయనిధి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ పేర్కొన్నారు. అయితే, డీఎంకే మాత్రం తన నాయకుడి వ్యాఖ్యలను సమర్థించుకుంది. మాజీ మంత్రి టి. మనో తంగరాజ్ స్పందిస్తూ.. కావేరీ సమస్య, డెల్టా రైతుల కష్టాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ వివాదాన్ని రాజకీయంగా సృష్టించారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించకుండా ఉదయనిధిని అడ్డుకునేందుకే ఈ తరహా వివాదాలు తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు.