NTV Telugu Site icon

Somalia Explosions: సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు.. కంపించిపోయిన రాజధాని మొగడిష్ నగరం

Somalia Attack

Somalia Attack

Somalia Explosions: భారీ పేలుళ్లతో సోమాలియా దేశం దద్దరిల్లిపోయింది. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందినట్లు చెందినట్లు సమాచారం.

సోమాలియా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం సంభవించిన రెండు పేలుళ్లతో సోమాలియా రాజధాని మొగడిషు నగరం కంపించిపోయింది. రెండు వరుస పేలుళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రెండు కార్లలో బాంబుల పేలుడు ధాటికి పదుల సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రద్దీగా ఉండే జంక్షన్‌లో నిమిషాల గ్యాప్‌లో బాంబు పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి వందల మీటర్ల ఎత్తులోకి దట్టమైన పొగలు విస్తరించాయి. కిలోమీటర్లమేర పరుచుకున్న పొగతో స్థానికులు ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. తొలుత ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర జరిగిన పేలుడులో ఓ అంబులెన్స్‌ ధ్వంసం కాగా.. రద్దీగా ఉండే ఓ రెస్టారెంట్‌ సమీపంలో మరో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు ముమ్మరం చేశామన్నారు.

Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రకటన జారీ చేయలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే.. ఈ పేలుల్లు జరుగడం విశేషం.

అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తున్నది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2015 లో విద్యాశాఖపై ఒకసారి దాడి జరిగింది. జోబ్ జంక్షన్ వద్ద 2017 లో 500 మందికి పైగా మరణించిన పేలుళ్లకు అల్-షబాబ్ కారణమని తేలింది.